Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై సెరో సర్వేలో ముఖ్యమైన డేటాను తొలగించి ప్రచురణ?
- విశ్వసనీయ సమాచారంతో ఓ జాతీయ వార్తా పత్రిక కథనం
న్యూఢిల్లీ: ఇటీవల సెరో సర్వే ద్వారా దేశంలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో వెల్లడైంది. అయితే, ఈ సర్వేలో అతిముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అడ్డుపడటంతో వాస్తవ విషయాలు వెలుగులోకి రాలేదా? దేశంలో కరోనా ప్రభావం ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ఉందా? ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందనే డేటాను తొలగించారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వే పూర్తి స్థాయి డేటాను వెల్లడించడానికి ఐసీఎంఆర్ అడ్డుగోడగా నిలిచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని సర్వేలో పాల్గొన్న పలువురు పరిశోధకులు ఓ జాతీయ వార్తా పత్రికకు వెల్లడించినట్టు వార్తలోస్తున్నాయి. ఐసీఎంఆర్ నేతృత్వంలోని సీరో సర్వే ఈ నెల మొదట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని మొత్తం 70 జిల్లాల నుంచి సేకరించిన 28 వేల నామునాల ఆధారంగా జాతీయ సెరో పాజిటివిటీ స్థాయి 0.73 శాతంగా ఉన్నట్టు చూపించింది. అయితే, ఆరోగ్య పరిశోధకులు, ఐసీఎంఆర్ ఉన్నతాధికారుల సూచనల మేరకు సర్వే వివరాలను ప్రచురించడానికి ముందే కరోనా వ్యాప్తికి సంబంధించిన నిజమైన అంచనాలను మొదటి జాతీయ సెరో సర్వే అధ్యయనంలోని కీలకమైన భాగాన్ని తొలగించినట్టు తెలుస్తున్నది. తొలగించిన డేటా ప్రకారం.. దేశంలోని 10 హాట్స్పాట్ నగరాలు, కంటైన్మెంట్ జోన్లలో 15 నుంచి 48 శాతం మంది కరోనా బారినడ్డారు. వీటిల్లో అహ్మదాబాద్లోని కంటైన్మెంట్ జోన్లు అత్యధిక సెరో పాజిటివిటీ స్థాయిని కలిగి ఉన్నాయి.
కాగా, మేలో 70 జిల్లాలు, 10 హాట్స్పాట్ నగరాల డేటాను విశ్లేషించిన తర్వాత పరిశోధకులు తమ ఫలితాలను ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవకు సమర్పించారు. అయితే, ఈ సర్వే ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురించడానికి ముందే కంటైన్మెంట్ జోన్ల సమాచారాన్ని తొలగించాలని ఆర్డర్స్ వచ్చినట్టు తెలిసింది. దీనిపై పరిశోధకులు '' కంటైన్మెంట్ జోన్ల సమాచారాన్ని తొలగించమని ఎవరి నుంచి అర్డర్స్ వచ్చాయో పేర్కొనకుండా, పూర్తి సమాచారాన్ని ప్రచురిం చడానికి అనుమతి లేదనీ, ఈ విషయాలను వెల్లడించవద్దని చెప్పారు'' అని తెలిపారు. అయితే, తాము పూర్తి డేటాను ప్రచురించడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.
దీంతో అయిష్టంగానే పాలుపంచుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా, మార్చిలో విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ తో కరోనా వ్యాప్తి, మరణాలను విజయవంతంగా తగ్గించినట్టు కేంద్రంతో పాటు ఐసీఎంఆర్ సైతం స్పష్టం చేస్తున్నాయి. కానీ హాట్స్పాట్ జోన్లలోని గణాంకాలతో సరిపోలలేదు, సెరోసర్వే రెండో భాగాన్ని ప్రచురించే ప్రణాళిక సైతం లేదని తెలిపారు. ఈ విషయమై ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవను సదరు వార్తా పత్రిక ఫోన్కాల్స్, ఈమెయిల్ ద్వారా సంప్రదించగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది. అయితే,రాజకీయంగా నెలకొన్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ సమాచారాన్ని తొలగించినట్టు తెలుస్తున్నది. ఐసీఎంఆర్ 'పరిశోధన సమగ్రత'ను ఉల్లంఘించినట్టు స్పష్టమవుతున్నదని బయోఎథిస్ట్, ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ సంపాదకులు డాక్టర్ అమర్ జెసాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పరిశోధన సమగ్రత అంటే.. పరిణామాలు ఏమైనప్పటికీ.. పరిశోధన ప్రాజెక్టు పూర్తి వివరాలను వెల్లడించాలి. ఏ ఒక్క భాగాన్ని ఎంపికచేసుకోలేరు' అని తెలిపారు. అలాగే, సీనియర్ వైరాలజిస్ట్ డాక్టర్ టి.జాకబ్ జాన్ మాట్లాడుతూ.. 'ట్రంప్ పాలనలో సీడీసీలో ఏం జరిగిందో.. భారత్లోని ఐసీఎంఆర్తో అదే జరుగుతోంది. ఇది సైన్స్కు అంతరాయం కలిగిస్తుంది. వైద్య పరిశోధనలను రాజకీయం చేయడం వల్ల ఐసీఎంఆర్ విశ్వసనీయత కోల్పుతుందని' అభిప్రాయపడ్డారు.