Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఏ లక్ష్యాల సాధన కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆవిర్భవించిందో వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికే సంస్థ 'విశ్వసనీయత సంక్షోభం'లో పడుతోందని..దానిని అధిగమించాలంటే నేటి ఆధునిక సవాళ్లకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వర్చువల్గా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా రికార్డు చేసిన ప్రధాని మోడీ వీడియో ప్రసంగాన్ని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి ద్వారా ప్రసారం చేశారు. కోవిడ్-19 సంక్షోభం కారణంగా వివిధ దేశాల నేతలు ఈసారి న్యూయార్క్కు వెళ్లి ఐరాస సర్వప్రతినిధి సభలో నేరుగా పాల్గొనలేకపోయారు.
భద్రతా మండలిలో జనవరి నుంచి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా చేరనుంది. రెండేండ్లపాటు ఆ హోదాలో కొనసాగనుంది. మరోవైపు భారత్కు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వైవిధ్యతకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ గళం వినిపించే అవకాశం కల్పించాలని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. 75ఏండ్ల క్రితం యుద్ధ భయాలతో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో ఐరాస ఆశాకిరణంగా ఉద్భవించిందన్నారు. మొట్టమొదటిసారి యావత్తు ప్రపంచ సంక్షేమం కోసం ఓ సంస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. కానీ, ఐరాసలోని నాటి వ్యవస్థలతో నేటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఐరాస వల్లే నేడు భారత్ మెరుగైన స్థితిలో ఉందని కొనియాడారు. అలాగే సంస్థ తరఫున ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపన కోసం కృషి చేస్తూ అమరులైన వారికి నివాళులు అర్పించారు.