Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 రోజుల ముందుగానే చుట్టేసిన మోడీ సర్కార్
- పార్లమెంటు నిరవధిక వాయిదా
- కార్పొరేట్ల అనుకూల నిర్ణయాలకే అగ్రతాంబూలం
- వ్యవసాయం... లేబర్ కోడ్ బిల్లుల ఆమోదమే లక్ష్యంగా సభల నిర్వహణ
- కార్మికులు, రైతులు, సామాన్యుల సంక్షేమంపై చర్చే లేదు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణను మోడీ సర్కార్ మమ అనిపించింది. తమకు కావాల్సిన కార్పొరేట్ అనుకూల బిల్లులను ఆమోదించుకున్న మరుక్షణమే ఉభయ సభలకు ముగింపు పలికింది. ఇదివరకు వెల్లడించిన షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందే బుధవారం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసింది. సామాన్య ప్రజానీకం, కరోనా వ్యాప్తి, అంటువ్యాధి వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, రైతుల ఇబ్బందులు, కార్మికుల కష్టాలపై ఏ సభలోనూ ఇసుమంతైన చర్చ జరగకుండానే సమావేశాలను సర్కారు వాయిదా చేసింది. వాస్తవానికి సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు 18 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే కరోనా ప్రభావం పేరుతో 10 రోజులకే ప్రభుత్వం కుదించింది. భారత పార్లమెంట్ చరిత్రలో 1952 తరువాత అతి తక్కువ రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు వెల్లడించాయి.