Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ పోలీసుల తాజా చార్జిషీట్
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి అభియోగాల పరంపర కొనసాగుతున్నది. తాజా ఛార్జిషీట్లో ౖ సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్, ఉదిత్రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, స్వరాజ్ అభియాన్ నేత యోగేందర్ యాదవ్లపై పోలీసులు అభియోగాలు మోపారు. పౌరసత్వాన్ని సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలను వీరిపై మోపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో మత ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం
ఏచూరి, పలువురు మేధావుల పేర్లను ఛార్జిషీట్లో కేంద్ర హౌంశాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులు చేర్చారు. వీరంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చార్జిషీట్లో తెలిపారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న ఢిల్లీ పోలీసులు కేంద్ర హౌంశాఖ పరిధిలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షాలకు చెందిన నేతలు, సామాజిక కార్యకర్తలు, ఇతరులపై అభియోగాలు మోపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మత హింసకు కారణమయ్యేలా ప్రసంగాలు చేసిన అధికార పార్టీకి చెందిన నేతలకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.