Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ పరిహార సెస్లో... ఉల్లంఘనలు
- రూ.47వేల కోట్లు తన ఖాతాలో కలిపేసుకున్న కేంద్రం
న్యూఢిల్లీ : పన్ను వసూళ్లలో కేంద్రం అసలు రంగు మరోమారు బయటపడింది. జీఎస్టీ చట్టం అమలులో కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడి, దాదాపు రూ.47వేల కోట్లను తన ఖాతాలో వేసుకుందని 'కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్' (కాగ్) వెల్లడించింది. తద్వారా పన్ను ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపిందని, ద్రవ్యలోటు తక్కువగా ఉందని చూపడానికి ఉపయోగించుకుందని కాగ్ తన నివేదికలో విశ్లేషించింది. రాష్ట్రాలకు నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన 'పరిహార సెస్ నిధి' లెక్కల్ని ఇష్టానుసారం చూపిందని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది. రెండేండ్లుగా 'జీఎస్టీ సెస్' ఓ వైపు వసూలు చేస్తూనే, దానిని రాష్ట్రాలకు బదిలీ చేయలేదని తాజా నివేదికలో పేర్కొన్నది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీఎస్టీ నష్టపరిహార సెస్ కింద కేంద్రం 2017-18, 2018-19 సంవత్సరల్లో రూ.47వేల కోట్లు వసూలు చేసింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ సమ్మలిత నిధిలోకి వెళ్లిపోయింది. వాస్తవానికి ఇదంతా కూడా రాష్ట్రాలకు బదిలీ చేయాలి. ఈనేపథ్యంలో, రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారంపై కేంద్రం చేస్తున్న వాదన మొత్తం అబద్ధాల పుట్ట అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.