Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో ఇండియా రెండోస్థానానికి చేరింది. సెప్టెంబరు 27నాటికి మనదేశంలో కేసుల సంఖ్య 60లక్షలు దాటింది. దాంతో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానంలో నిలిచింది. మనదేశంలో కరోనాబారిన పడి చనిపోయినవారి సంఖ్య 96వేలు దాటింది. అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఎక్కడో అమెరికాలో, ఇటలీలో, స్పెయిన్లో కరోనా విజృంభిస్తోందని మొన్నటివరకూ ఘనంగా చెప్పిన మన పాలకులు...ఇప్పుడు చేతులెత్తేశారని వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవల్ని విస్తరించటంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, రాష్ట్రాలకు తగినవిధంగా నిధులు విడుదలచేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరుపై తాజాగా కొన్ని గణాంకాలు విడుదలయ్యాయి. దీని ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా కరోనా పరీక్షలు జరుగుతున్న దేశాల్లో ఇండియా రెండోస్థానంలో ఉంది.
పాజిటివ్ రేటు ఇండియాలో ఆందోళనకర స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈఏడాది మార్చి 27న కేసుల సంఖ్యపరంగా ఇండియా 195దేశాల్లో 41వ స్థానంలో ఉంది. మే 27నాటికి 9వ స్థానంలోకి, జులై 27నాటికి 3వ స్థానంలోకి, సెప్టెంబరు 27నాటికి 2వ స్థానంలోకి వచ్చింది. ప్రతి 10లక్షల మందికి వైరస్బారిన పడుతున్న వారి విషయంలో, ఇండియా మార్చి 27న 174వ స్థానంలో ఉండగా, సెప్టెంబరు 27నాటికి 80వ స్థానంలోకి వెళ్లింది. అలాగే మరణాల విషయంలోనూ మార్చి 27న 32వ స్థానంలో ఉండగా, సెప్టెంబరు 27నాటికి 3వ స్థానంలో ఉంది.