Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్ కాలంలో 25 శాతం పతనం
- ఊడిన ఉద్యోగాల ఎఫెక్ట్
చెన్నై : గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా పట్టణ వినిమయం అమాంతం పడిపోయింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు కాలంలో ఏకంగా మైనస్ 25 శాతానికి క్షీణించినట్టు మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ ఓ రిపోర్ట్లో వెల్లడించింది. లాక్డౌన్ కాలంలో ప్రధానంగా భారీగా ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గతేడాది జూన్ త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో వాస్తవ ప్రయివేటు వినిమయ వ్యయం ఏకంగా 26.7 శాతం పడిపోయింది. ఇదే సమయంలో పట్టణ వినిమయం ఏకంగా 34 శాతం, గ్రామీణ వినిమయం 4 శాతం చొప్పున క్షీణించాయి. ఆర్థిక సంవత్సరాలు 2017-19 కాలంలో వినిమయ సగటు వృద్థి రేటు 8 శాతంగా నమోదైంది. కాగా 2019-20లో పట్టణ వినిమయం కేవలం 0.6 శాతం మాత్రం పెరిగింది. గత కొన్ని మాసాలుగా ప్యాసింజర్ వాహన అమ్మకాలు పడిపోవడం, విమానయాన ప్రయాణికుల సంఖ్య బలహీనంగా ఉండటం, కన్సూమర్ డ్యూరెబుల్స్ గూడ్స్ అమ్మకాలు క్షీణించడం పట్టణ వినిమయాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. అదే విధంగా పెద్ద మొత్తంలో ఉద్యోగ కోతలు, వేతన తగ్గింపులు చోటు చేసుకోవడం వినిమయాన్ని దెబ్బ తీశాయి. పట్టణ వినిమయం పెరగకుండా ప్రయివేటు వినిమయానికి డిమాండ్ మద్దతు లభించదని మోతిలాల్ ఓస్వాల్ విశ్లేషించింది. అదే విధంగా ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడానికి ప్రధాన మద్దతు అవసరమని సూచించింది. అప్పుడే వాస్తవ జీడీపీ పెరుగుదలకు కూడా మద్దతు లభించనుందని తెలిపింది.