Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అరేబియా మహాసముద్రంలోని మలబార్ తీరంలో జరిగనున్న భారత్, అమెరికా, జపాన్ దేశాల త్రైపాక్షిక నావికాదళ విన్యాసాల్లో అస్ట్రేలియా కూడా పాలుపంచుకోనుంది. నవంబర్ నెలాఖరులో జరిగే ఈ విన్యాసాల్లో అస్ట్రేలియా కూడా భాగం కానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు విషయంలోభారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నావికా దళ విన్యాసాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విన్యాసాలకు సంబంధించి ప్రణాళికను ఖరారు చూసేందుకు ఈ అక్టోబర్ నెలాఖరులో ప్లానింగ్ సమావేశం వర్చువల్ రూపంలో జరగనుంది. మలబార్ విన్యాసాల్లో అస్ట్రేలియా చేరికకు సంబంధించిన అంశం ఈనెల ఆరంభంలో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ క్వాడ్లో భారత్, అమెరికా, జపాన్, అస్ట్రేలియాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. విన్యాసాల్లో అస్ట్రేలియా ఆహ్వానించే అంశానికి సంబంధించి ఆగస్టు నెలలో కూడా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక సమావేశం నిర్వహించింది. 1992లో భారత్, అమెరికా మధ్య ప్రారంభమైన ద్వైపాక్షిక విన్యాసాలు, అనంతరం 2015లో జపాన్ చేరికతో త్రైపాక్షిక విన్యాసాలుగా మారాయి. తాజాగా ఈ విన్యాసాల్లో ఈ మూడు దేశాల సరసన అస్ట్రేలియా కూడా చేరింది.