Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై ప్రధాని మోడీ
- పండుగలప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన
నవ తెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహమ్మారి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేంత వరకు అలసత్వం వద్దని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ పోయింది కానీ, వైరస్ ఇంకా మన మధ్యే ఉందన్న విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. అమెరికా, బ్రిటన్లో తగ్గుముఖం పట్టిన వైరస్, మళ్లీ పుంజుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వైరస్ ప్రభావం, వ్యాక్సిన్ తయారీలో సాగుతున్న పరిశోధనలను వివరించారు. అలాగే, పండుగ సీజన్లు కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరస్ వ్యాప్తి విషయంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్లో దాని ప్రభావం కొంత తక్కువేనని అభిప్రాయపడ్డారు. భారత్లో ప్రతి 10 లక్షల జనాభాలో కేవలం 5,500 మందికే వైరస్ సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్లో ఆ సంఖ్య 25 వేలుగా నమోదైందని వివరించారు. ప్రతి 10 లక్షల జనాభాలో దేశంలో మరణాల రేటు 83 కాగా, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాలలో 600 కంటే ఎక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ, ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్క్లు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మీతో పాటు, మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లలు వైరస్ బారిన పడతారని అన్నారు. కరోనా వైరస్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని కోవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా తేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచంతో పాటు భారత్ కూడా వేచి చూస్తోందని అన్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే అందరికీ అందిస్తామన్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 10 కోట్లకు పైగానే వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. 2 వేల కోవిడ్ ల్యాబ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 90 లక్షల బెడ్లు ఖాళీ ఉన్నాయని, 12 వేల క్వారెంటైన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 'సేవా పార్మో ధర్మం' మంత్రాన్ని అనుసరించి, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్థంగా దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నారని అభినందించారు.