Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడ్డవారి సంఖ్య 78 లక్షలు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 53,370 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో వైరస్తో పోరాడుతూ 650 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,17,956కు పెరిగింది. కాగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో రికవరీ రేటు 61 శాతానికి పెరిగిందని కేంద్రం వెల్లడించింది. శనివారం నాటికి దేశంలో కరోనా రికవరీ రేటు 89.78 శాతానికి చేరిందనీ, కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో రికవరీ రేటు 61 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం 70,16,046 మంది రికవరీ కాగా, అందులో మహారాష్ట్రలో 20.6 శాతం, ఏపీలో 10.9, కర్నాటకలో 9.9, తమిళనాడులో 9.4, యూపీలో 6.1, ఢిల్లీలో 4.1 శాతం మంది ఉన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో.. శనివారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా 11.50 లక్షల మరణాలు
ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లోనే కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అన్ని దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 11,50,700లకు పెరిగింది. వైరస్ సోకిన వారి సంఖ్య 4,25,76,778కి చేరింది. ఇప్పటివరకూ 3,14,72,418 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కరోనా కేసులు, మరణాల నమోదైన దేశాల జాబితాలో మొదటి ఐదో స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, స్పెయిన్లు ఉన్నాయి. అమెరికాలో ఇప్పటివరకూ 87,52,121 పాజిటివ్ కేసులు, 2,29,317 మరణాలు నమోదయ్యాయి. బ్రెజిల్లో 53 లక్షలకు పైగా కేసులు, 1.56 లక్షల మరణాలు గుర్తించారు. రష్యాలో 25,821 మరణాలు, 14.97 లక్షల కేసులు నమోదయ్యాయి. స్పెయిన్లో దాదాపు 35 వేల మంది కరోనాతో చనిపోయారు.