Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ లో పోరాటం ఉధృతం
- రైతుల ఉద్యమస్ఫూర్తి అనిర్వచనీయం:ఎఐకెఎస్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, కార్పొరేట్ల అపవిత్ర కలయికకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇందులో భాగంగా దసరా పండుగ రోజైన ఆదివారం మోడీతో పాటు కార్పొరేట్లైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ దిష్టిబొమ్మలను దహనం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలు జరుగుతున్న వందకు పైగా ప్రాంతాల్లో ఈ దిష్టిబొమ్మల దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. మోడీ సర్కార్ నిరంకుశ, కార్పొరేట్ అనుకూల వైఖరికి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమ స్ఫూర్తితో పంజాబ్ రైతులు చేస్తున్న ఈ పోరాటం అనిర్వచనీయమని, రైతుల ఉద్యమ స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నామని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. పంజాబ్ రైతులు చేస్తున్న పోరాటంలో రైతు, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. పాటియాలా జిల్లాలో ఢిల్లీ-సంగూర్ జాతీయ రహదారిపై ఉన్న పంథ్ టోల్ గేట్ వద్ద జరిగిన ఆందోళనలో ఏఐకెఎస్ నాయకుడు పి.క్రిష్ణప్రసాద్ పాల్గొన్నారు. గత 20 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని ఆయన ప్రస్తావించారు. పెట్రోల్ బంకులు, మాల్స్, రిలయన్స్, అదానీ అగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్లకు చెందిన వేర్హౌస్లు, టోల్గేట్లు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ మహోద్యమం రైతాంగం చేస్తున్న ఐక్య పోరాటాలకు రాజకీయ దిశానిర్దేశం చేసిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న రైతుల డిమాండ్ను పరిగణనలోకి తీసుకోకుంటే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం జరుగుతున్న కార్మిక-రైతు ఐక్య పోరాటం మన దేశ భవిష్యత్తు రాజకీయాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని క్రిష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న రైతులనుద్దేశించి సీఐటీయూ నాయకులు ఎఆర్ సింధు, ఉషారాణి, ఎఐకెఎస్కు చెందిన కుల్వంత్ సింగ్, కిర్తి కిసాన్ సభకు చెందిన యోగేందర్ పాల్, ప్రదీప్ సింగ్(పంజాబ్ స్టూడెంట్ యూనియన్) ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో రైతులతో పాటు ఏఐకేఎస్్, సీఐటీయూ, ఐద్వా నేతలు పాల్గొన్నారు.