Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోదాను కోల్పోయే స్థితిలో భారత్
- మోడీ పాలన తీరే కారణం : వీ-డెమ్ సంస్థ 'డెమోక్రసీ రిపోర్ట్'
న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచులో ఉన్నది. ప్రస్తుతం మోడీ సర్కార్ చర్యలతో ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే స్థితి భారత్కు ఏర్పడింది. స్వీడన్ దేశానికి చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్.. ఈ ఏడాదికి సంబంధించిన 'డెమోక్రసీ రిపోర్ట్'లో ఈ విషయాన్ని వెల్లడించింది. 'ఆటోక్రెటైజేషన్ సర్జెస్-రెసిస్టెన్స్ గ్రోస్'(పెరుగుతున్న నిరంకుశత్వం- ఉప్పొంగుతున్న ప్రతిఘటన) పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. అయితే, ఈ దారుణ పరిస్థితికి మోడీ సర్కారు తీరే కారణమని పేర్కొన్నది. మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలకు కావాల్సిన చోటు చాలా దారుణంగా కుంచించుకుపోవడమే ఈ పరిస్థితికి కారణమని వివరించింది. జీ20 లోని అనేక దేశాలు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలూ ఇప్పుడు '' ఆటోక్రటైజేషన్( నియంతృత్యం) మూడో వేవ్'లో ఉన్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ పరిస్థితుల కారణంగా గణనీయమైన జనాభా కలిగిన భారత్, బ్రెజిల్, అమెరికా, టర్కీ వంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపుతున్నదని వివరించింది. '' భారత్.. ప్రజాస్వామ్య క్షీణత దారిని కొనసాగించింది. ఇప్పుడు అది ప్రజాస్వామ్య హౌదాను దాదాపు కోల్పోయింది'' అని నివేదికలో పేర్కొన్నారు.
భావప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛపై దాడులు 31 దేశాలను ప్రభావితం చేస్తున్నాయని వివరించింది. పదేండ్లతో పోల్చితే భారత్లాంటి దేశాల్లో
విద్యా స్వేచ్ఛ 13శాతం పడిపోయినట్టు తేల్చింది. ఇక టాప్-10 లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్ (ఎల్డీఐ) దేశాల జాబితాలో భారత్ ఉన్నది. హంగరీ మొదటి స్థానంలో ఉండగా.. భారత్ ఆరో స్థానంలో ఉన్నది. భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి చేరిందన్న నివేదికల సమాచారం ఇదే మొదటిసారి కాదు. 2019లో విడుదల చేసిన డెమోక్రసీ ఇండెక్స్లో భారత్..10 స్థానాలు దిగజారి 51వ స్థానానికి పడిపోయింది. దేశంలో జరుగుతున్న శాంతియుత నిరసనలు, సీఏఏ ఆందోళనలు, దేశంలో ప్రత్యేకించి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ జరిగిన దాడులు, మీడియా సంస్థలే టార్గెట్గా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు తీరును ఈ నివేదిక వివరించింది. భారత్లో మోడీ సర్కారు పాలన ఎంత దారుణ స్థితిలో ఉన్నదో తెలుసుకోవడానికి తాజా నివేదికనే ఒక ఉదాహరణ అని పౌర సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.