Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్నాబ్ గోస్వామిని ఉద్దేశించి సీజేఐ ఎస్.ఎ.బోబ్డే
- మీడియా ప్రముఖుడు కాబట్టి ప్రశ్నించరాదంటే ఎలా?
న్యూఢిల్లీ : పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమైనదనీ, అలాగే పాత్రికేయ వృత్తి కూడా అత్యంత బాధ్యతతో నిర్వర్తించాల్సిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని సీజేఐ అన్నారు. పాల్ఘార్లో మూకదాడి, బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కార్మికులు నిరసనకు దిగటం(లాక్డౌన్ సమయంలో) ఘటనలపై ఆర్నాబ్ గోస్వామి వాఖ్యాతగా ప్రసారమైన టీవీ ప్రసారాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర పోలీసులు రెండు కేసులు నమోదుచేశారు. వీటిపై ఆర్నాబ్ గోస్వామి బాంబే హైకోర్టును ఆశ్రయించగా, స్టే మంజూరుచేసింది. ఈ స్టే ఆర్డర్ను ఎత్తేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
టీఆర్ పీ కుంభకోణం
టీఆర్పీ కుంభకోణం కేసు విచారణలో ఆర్నాబ్ గోస్వామి తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంలో వాదనలు వినిపించారు. సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ వై.చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ..''మీ క్లయింట్ మీడియాలో ప్రముఖ వ్యక్తి. పత్రికా స్వేచ్ఛ అనేదానిని మేమూ అంగీకరిస్తాం. మీడియాకు చెందిన ప్రముఖ వ్యక్తి కాబట్టి, అతడ్ని ప్రశ్నించకూడదన్న వాదనను మాత్రం ధర్మాసనం అంగీకరించదు. అలాంటి రక్షణ కవచం ఎవరూ పొందలేరు. సమాజంలో శాంతి, సామరస్యాల్ని పరిరక్షించటం న్యాయవ్యవస్థ ముఖ్య బాధ్యత '' అని అన్నారు. రిపబ్లిక్ టీవీలో ఆయన రిపోర్టింగ్ చేసిన తీరుపై సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది సరైన విధానం కాదన్నారు. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్నాబ్ గోస్వామిని ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదావేసింది.
'హథ్రాస్'పై అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు పర్యవేక్షించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా, సీబీఐ విచారణపైనా తమకు నమ్మకం లేదని, ఈ కేసును సుప్రీంకోర్టే స్వీకరించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి విచారణను పర్యవేక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే ఈ కేసులోని ఇతర కోణాలను సైతం అలహాబాద్ హైకోర్టే చూసుకుంటుందని, బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షుల భద్రతను కూడా హైకోర్టే పరిగణనలోకి తీసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. 19 ఏండ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న హథ్రాస్లో నలుగురు ఉన్నత కులస్తులు లైంగికదాడి చేసి దారుణంగా చంపేశారు. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. అలానే పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు.