Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి అన్నదాతల అల్టిమేటం
- ఢిల్లీకి భారీగా తరలివస్తున్న రైతులు
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, ఇదే ఆఖరి ఛాన్స్ అని కేంద్రానికి అన్నదాతలు అల్టిమేటం ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం మహాసంగ్రామాన్ని తలపిస్తున్నది. వేలాది మంది రైతులు దేశ సరిహద్దులకు బుధవారం చేరుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ ఆందోళనలో భాగస్వాములయ్యారు. రైతుల ఆందోళన బుధవారం ఏడో రోజూ కొనసాగింది. ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలను మూసి వేశారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలు సింఘూ, టిక్రీలోను, అలాగే జరోడా, ఝాటిక్రా సరిహద్దులో ఆందోళన కొనసాగుతున్నది. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు నోయిడా, ఘజిపూర్, చిల్లా ప్రాంతాల్లో కూడా ఆందోళన హోరెత్తింది. భారీస్థాయిలో బారికేడ్లుతో పాటు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 120 కిలో మీటర్ల మీర రైతులతో నిండి ఉంది. చిన్నారులు, మహిళలు, ముసలివాళ్లు సైతం రైతుల ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు డ్రోన్ కెమెరాలతో రైతులపై నిఘా పెట్టారు. సింఘూ వద్ద భారీస్థాయిలో పోలీసులు బలగాలను పెంచారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తరలిరావడంతో మరింత భద్రతను పెంచేందుకు పోలీసులు వ్యూహ రచన చేస్తున్నారు. సింఘూ వద్ద పంజాబీ, హిందీ భాషల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అభ్యంతరాలు పంపిన రైతు సంఘాలు
మూడు చట్టాల్లో క్లాజ్ టు క్లాజ్ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు పంపాయి. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం) మరోసారి చర్చలు జరపనున్నది. ఇంటెలిజెన్సీ రిపోర్టులు తీసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్తో బుధవారం చర్చలు జరిపారు. రైతులతో జరిగే చర్చలపై మంతనాలు జరిపారు. ప్రభుత్వ వాదన మరోసారి వినిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ చర్చలకు హోం మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నది.
రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు
రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతున్నది. దేశంలోనే కాకుండా.. అంతర్జాతీయ సంఘీభావం లభించింది. ఎన్ఆర్ఐల నుంచి అపూర్వ మద్దతు లభించింది. టొరొంటోలో కిసాన్ ర్యాలీ నిర్వహించారు. కెనడా, ఆస్ట్రేలియాతో పాటు వివిధ దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అలాగే రైతుల ఉద్యమానికి దేశంలోని రవాణా సంఘాలు మద్దతుగా నిలిశాయి. ఆలిండియా మోటర్ ట్రాన్స్ పోర్టు యూనియన్ రైతులకు మద్దతుగా సమ్మె చేయాలని నిర్ణయించింది. పది మిలియన్ల ట్రక్కులున్న ఈ యూనియన్ దేశంలోని వివిధ ప్రాంతాలకు కూరగాయలు, ఇతర వస్తువులను సరఫరా చేస్తాయి. డిసెంబర్ 8న ఉత్తర భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమ్మె చేస్తామని ఆ సంఘం అధ్యక్షుడు కుల్తారన్ సింగ్ అత్వాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో ట్రక్కులను నిలిపివేస్తామని పేర్కొన్నారు. సింఘూ వద్ద జరుగుతున్న ఆందోళనకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మద్దతు తెలిపారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి
రైతు చట్టాలు రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు సంఘం నేత దర్శన్ పాల్ డిమాండ్ చేశారు. బుధవారం సింఘూ (ఢిల్లీ-హర్యానా సరిహద్దు) వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల నేతలు మాట్లాడారు.