Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త క్రెడిట్ కార్డ్ల జారీపై నిషేధం
- డిజిటల్ సేవలపై ఆంక్షలు
- ఆర్బీఐ కఠిన నిర్ణయాలు
- పడిపోయిన షేర్ విలువ
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ బ్యాంకు అందిస్తున్న ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయాలు చోటు చేసుకోవడంతో ఆర్బీఐ పలు ఆంక్షలు పెట్టింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆ బ్యాంకును ఆదేశించింది. అదే విధంగా కొత్త డిజిటల్ సేవలేవీ ప్రారంభించకూడదని ఆంక్షలు విధించింది. తమ బ్యాంకు ఐటీ వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లను తొలగించాలని ఆదేశించినట్టు స్వయంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గురువారం స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. ఈ పరిణామంతో గురువారం బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 2.13 శాతం లేదా రూ.29.90 కోల్పోయి రూ.1,377.05కి పడిపోయింది. గత రెండేండ్లలో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో తరచూ అంతరాయాలు కలగడంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పలుమార్లు బ్యాంక్ ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురైయ్యారు. చాలాసేపు ఇలా సేవలు నిలిచిపోవడంపై విచారణ జరపాలని బ్యాంకు బోర్డుకు ఆర్బీఐ సూచించింది. నవంబర్ 21న ఆ బ్యాంక్ ప్రైమరీ డేటా సెంటర్లో పవర్ ఫెయిల్యూర్ కారణంగా 12 గంటల పాటు డిజిటల్ సేవలు నిలిచిపోయాయి.
నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఏటీఎం కార్యకలాపాలు కూడా పనిచేయలేదు. తమ డాటా సెంటర్లలో అనూహ్య సమస్య తలెత్తిందని పేర్కొన్న బ్యాంకు ఇందుకు గల కారణాలేమిటో మాత్రం స్పష్టంగా వివరించలేదు. ఇది హ్యాకింగ్ దాడా, అంతర్గతంగా తలెత్తినా సమస్యా, లేక బ్యాంకు ఐటీ వ్యవస్థలో ఉన్న సంస్థాగత లోపాల అన్న దానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. గత రెండేండ్లుగా బ్యాంకులో ఇటువంటి సమస్యలు పెరుగుతుండటంతో ఆర్బీఐ తాజాగా సీరియస్ అయ్యింది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డ్ల జారీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దూసుకుపోతుంది. ఆర్బీఐ నిర్ణయంతో ఆ బ్యాంక్కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ఆదేశాలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందిస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని వివరణ ఇచ్చింది. తమ ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేయనున్నట్టు తెలిపింది.