Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలపై పెరిగిన హింస.. : నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నాడియా మురాద్
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేం దుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చేపట్టిన చర్యల వల్ల మహిళలపై లైంగిక హింస పెరిగిందని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నాడియా మురాద్ అన్నారు. మహిళల అక్రమ రవాణా, మహిళలపై దాడులు పెరిగా యని, మహిళా భద్రత, ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆమె అన్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో 'కరోనా సంక్షోభం'పై మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ దేశస్థురాలైన నాడియా, ఇరాకీ యాజ్డీ మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. యుద్ధం, హింస, జాతి హననం, మానవ అక్రమ రవాణా..మొదలైనవాటిలో బాధితులుగా మారుతున్న చిన్నారులు, మహిళల్ని ఆదుకోవటం కోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి సేవలు అందిస్తున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వివిధ దేశాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు, రవాణాను స్తంభింపజేశారు, ఇదంతా కూడా మహిళలపై ప్రభావం చూపిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఆంక్షల వల్ల మానవ అక్రమ రవాణా, మహిళలపై లైంగిక దాడులు తగ్గాలి..కానీ అలా జరగలేదు. మరింత పెరిగాయని ఆమె విశ్లేషించారు. ''అనేక దేశాల్లో గృహహింస పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంటికే పరిమితం కావటం వల్ల మహిళలు ఎటూ వెళ్లలేక, హింస, అణచివేతకు గురయ్యారు. మహిళల భద్రత, ఆరోగ్యం కూడా ప్రభావితమయ్యాయి. మానసిక మద్దతు సైతం దూరమైంది'' అని ఆందోళనవ్యక్తం చేశారు.