Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలు, అతి తక్కువ వేతన జీవులకు గడ్డుపరిస్థితులు : ఐఎల్ఓ రిపోర్ట్
న్యూఢిల్లీ : కంటికి కనిపించని 'శత్రువు' ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నది. 2020కి చరిత్రలో చెరగని ముద్రవేసింది కరోనా. కోవిడ్-19 మహమ్మారి ఫలితంగా మూడింట రెండు వంతుల దేశాల్లో ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు పడిపోయాయి. ఇందులో మహిళలు, తక్కువ వేతన జీవులపై దీని ప్రభావం తీవ్రంగా పడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. గ్లోబల్ వేజ్ 2020-21 నివేదికను ఐఎల్ఓ విడుదల చేసింది. 2020 మూడవ త్రైమాసికంలో 34.5 కోట్ల పూర్తికాల ఉద్యోగాలతో సమానమైన నష్టం జరిగినట్టు అంచనావేసింది. ఈ సంక్షోభం సమీప భవిష్యత్లోనూ వేతనాలపై ప్రభావం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మహమ్మారి ఇప్పటికే ప్రజారోగ్య సేవా ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి కలిగించిందనీ, ఈ రంగంలో అత్యధికమంది మహిళలేనని తెలిపింది.
కార్మికుల ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడిందనీ, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారనీ, పేదల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శ్రామిక పేదల సంఖ్య పెరిగిందని తెలిపింది. మహమ్మారి ప్రబలిన మొదటి నెలలో, ప్రపంచవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల మొత్తం ఆదాయం సగటున దాదాపు 60శాతం వరకూ తగ్గిందని ఐఎల్ఓ అంచనా వేసింది. లాక్డౌన్ విధించిన మొదటి నెలలో అసంఘటితరంగ కార్మికుల్లో పేదరికం 26శాతం నుంచి 59శాతానికి పెరిగిందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16.4 కోట్ల మంది వలసకార్మికుల్లో 77శాతం మందిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపింది.
మహిళలపై ప్రభావం
పురుషులతో పోలిస్తే మహిళా కార్మికులపై మహమ్మారి పెను ప్రమాదాన్ని సృష్టించిందని తెలిపింది. ఎందుకంటే, అతి ముఖ్యమైన ఆరోగ్యరంగంతోపాటు. సామాజిక రంగంలోనూ మహిళా కార్మికుల సంఖ్య 70 శాతానికిపైనే. అంతేకాదు, ఇతర కీలక రంగాల్లోనూ మహిళలు పనిచేస్తున్నారు. ఉద్యోగ నష్టాలను ఎదుర్కొన్నది కూడా అత్యధికమంది వారేనని ఐఎల్ఓ పేర్కొంది. ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, అమెరికా వంటి దేశాలతోపాటు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఉద్యోగ గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. టోకు, రిటైన్ వ్యాపార రంగాలతోపాటు.. మహిళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న ఆహార, వసతి సేవలు వంటి రంగాలు లాక్డౌన్తో దెబ్బతిన్నాయని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది.
ఉద్యోగ నష్టాలతో ఆదాయాలు తగ్గాయనీ, దీంతో ఇంటి పని కార్మికులు ఉపాధిని కోల్పోయారని పేర్కొంది. 5.5 కోట్ల మంది గృహ కార్మికుల్లో మూడింట రెండొంతులమందికిపైగా మహిళలే కావటం గమనార్హం. రెండో త్రైమాసికంలో మహిళలు తమ వేతనాల్లో 8.1శాతం కోల్పోయారనీ, ఇది పురుషుల్లో 5.4శాతంగా పేర్కొంది.
తక్కువ వేతనంతో పనిచేసే కార్మికులు
ఈ సంక్షోభం తక్కువ వేతన కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది వేతన అసమానతల పెరుగుదలకు దారితీసింది. తక్కువ వేతనం ఉన్న వారు తమ వేతనాల్లో 17.3శాతం కోల్పోయారని తెలిపింది. కనీస వేతనం కంటే తక్కువ పొందుతున్న కార్మికులు అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో చాలా మంది ఉన్నారని పేర్కొంది. మన దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 80 నుంచి 90 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంఘటితరంగంలో కార్మికులు సగటున 3.9శాతం వేతనాన్ని నష్టపోగా.. అసంఘటిత రంగంలో 22.6శాతం వేతనాన్ని కోల్పోయినట్టు నివేదిక పేర్కొంది.