Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి వెంట దేశమంతా ఉంది
- డిసెంబర్ 8న భారత్ బంద్కు మద్దతు
- సాగు వ్యతిరేక చట్టాల రద్దుతోనే అన్నదాతలకు ప్రయోజనాలు
- ప్రజలు కావాలా? అదానీ, అంబానీలు కావాలా? మోడీ తేల్చుకోవాలి : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ వెల్లడి
- రైతుల ఆందోళనలకి సంఘీభావంగా ఢిల్లీ జంతర్మంతర్లో ప్రజా సంఘాల ర్యాలీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళనచేస్తున్న దేశ అన్నదాతల పట్ల మోడీ సర్కారు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా డిసెంబర్ 8న భారత్ బంద్కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న రైతాంగం ఒంటరి వారు కాదనీ, వారి వెంట దేశంలోని అన్నివర్గాల ప్రజలూ ఉన్నారని అన్నారు. మోడీ సర్కార్ ఇటీవల పార్లమెంట్లో ఆమోదించుకున్న రైతు వ్యతిరేక చట్టాల రద్దుతోనే దేశ రైతాంగ ప్రయోజనాలు కాపాడుకోగలుగుతామని పేర్కొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు కావాలా? లేక, దేశ సంపదను దోపిడీ చేస్తున్న అదానీ, అంబానీలు కావాలా? పధ్రాని మోడీ తేల్చుకోవాలని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత తొమ్మిది రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రజా సంఘాలు శుక్రవారం ఢిల్లీలో ఆందోళన చేపట్టాయి. దేశ రాజధానిలోని కన్నట్ ప్లేస్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే మార్గమధ్యలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు రోడ్డుపైనే భైఠాయించారు. రైతులకు మద్దతుగా, కార్పొరేట్లకు, మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ప్లకార్డు చేతబూని పెద్దఎత్తున నినాదాలతో హౌరెత్తించారు. ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ రైతులు పోరాటం అత్యంత క్రమశిక్షణ, పట్టుదలతో జరుగుతున్నదని అన్నారు. చారిత్రాత్మకంగా జరుగుతున్న ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతున్నదని స్పష్టం చేశారు. కానీ మోడీ ప్రభుత్వం ప్రజల కంటే, కార్పొరేట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని విమర్శించారు. రైతు చట్టాలు రద్దు చేయాలనీ, దేశ ప్రయోజనాలు కాపాడాలని కోరారు. రైతు సమస్యలపై మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే, భారత్ బంద్ నిర్వహిం చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఆందోళ నలో మయూక్ బిశ్వాస్ (ఎస్ఎఫ్ఐ), వీరేందర్ గౌర్ (సీఐటీయు), విక్రమ్ సింగ్ (ఏఐఏడబ్ల్యూయూ), మెమూనా మొల్లా (ఐద్వా), పూనమ్ కౌశిక్ (పీఎంఎస్), దీప్తి (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), తుహిన్ దేబ్ (టీయూసీఐ), హరిష్ (కేవైఎస్),అనిమేష్ (ఐఎఫ్టీయూ), రీతూ (ఏఐఎంఎస్ఎస్) తదితర సంఘాల కార్యకర్తలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.