Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న మోడీ, అదానీ, అంబానీల దిష్టి బొమ్మల దహనం
- మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లు
వెనక్కి తీసుకోవాలి
- కనీస మద్ధతుధరకు చట్టబద్ధత కల్పించాలి: రైతుల సంఘాల నేతలు హన్నన్ మొల్లా, యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ బ్యూరో : రైతు వ్యతిరేక చట్టాల రద్దు, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రైతు సంఘాలు పూనుకున్నాయి. అందులో భాగంగానే డిసెంబర్ 8 (మంగళవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 5 (శనివారం) ప్రధాని మోడీ, అదానీ, అంబానీల దిష్టిబొమ్మలను ప్రతి గ్రామంలో దహనం చేయాలని పిలుపునిచ్చాయి. శుక్రవారం నాడిక్కడ ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘూలో అన్ని రైతు సంఘాలు సమావేశం అయ్యాయి. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల నేతలు హన్నన్ మొల్లా, యోగేంద్ర యాదవ్, కిరణ్ విస్సా, హెచ్ఎస్ లాఖోవల్, ఉద్వీర్ సింగ్, గుర్నామ్ సింగ్ తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలపై తాము సంతృప్తి చెందలేదని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, సి2+50 శాతంతో కలిపి ఎంఎస్పీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వరాజ్య ఇండియా నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మోడీ సర్కార్ మొండి వైఖరి విడనాడాలని హితవు పలికారు. రైతుల ఉద్యమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని, మోడీ సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచాలని రైతు సంఘాలు భావించాయని అన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గుర్నామ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం జరిగే చర్చల్లో తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే, మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. హెచ్ఎస్ లఖోవాల్ (బీకేయూకే) ప్రధాన కార్యదర్శి, కిరణ్ విస్సా (రైతు స్వరాజ్య వేదిక) రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గురువారం జరిగిన సమావేశంలోనే రైతు సంఘాలన్ని ఏకగ్రీవంగా చెప్పాయని అన్నారు. రైతు స్వరాజ్య వేదిక నేత కిరణ్ విస్సా మాట్లాడుతూ కర్నాటకలో అసెంబ్లీ ఎదుట వారం రోజుల పాటు నిరవధికంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆందోళనలు మరిన్ని చేయాలని సూచించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు రద్దు చేయకపోతే, ఆందోళనల్లో మరింత మంది భాగస్వామ్యం అవుతారని అన్నారు.
హన్నన్ మొల్లాపై కేసు నమోదు: ఏఐకేఎస్ ఖండన
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 25న పార్లమెంటు స్ట్రీట్లో నిరసన వ్యక్తం చేసినందుకు ఏడేండ్లపాటు జైలు శిక్ష విధించే ఐపీసీ సెక్షన్ కింద ఢిల్లీ పోలీసు అధికారులు ఆయనపై అభియోగాలు మోపారు. అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని ఏఐకేఎస్ ఖండించింది. అణచివేత, బెదిరింపులు రైతుల ఉద్యమాన్ని నిరోధించలేవని స్పష్టం చేసింది. రైతులు, కార్మికులపై దేశమంతటా దాఖలు చేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించే నాయకులను, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకునే బీజేపీ ప్రభుత్వం పిరికి పంద చర్యలను ఖండించారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయ నిరసనలు జరగకుండా బీజేపీ ప్రభుత్వం 1897లో ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కు సహాయం తీసుకుంటోందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సాకుతో ప్రజాస్వామ్య నిరసనలను అణిచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నిరసన తెలిపే హక్కును కాపాడటానికి అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఒకతాటిపైకి రావాలని ఏఐకేఎస్ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య హక్కులపై ఈ దాడికి నిరసనగా నేడు (శనివారం) దేశవ్యాప్తంగా ఏఐకేఎస్ అన్ని యూనిట్లు ఆందోళనలు నిర్వహించాలని పిలుపు నిచ్చింది. పెద్ద సంఖ్యలలో నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీల దిష్టి బొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చింది.