Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దునే రైతు సంఘాలు కోరాయనీ, అమలు నిలుపుదల(స్టే)ను కోరలేదని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళ వారం ఓ ప్రకటన విడుదల చేసింది. చట్టాలను తాత్కాలికంగా అమలు చేయ డాన్ని నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తూ స్టే విధించడం స్వాగతించదగినదనీ, కాని పరిష్కారం కాదని స్పష్టం చేసింది. స్టే విధించాలనే పరిష్కారాన్ని రైతు సంఘాలు అడగడం లేదని పేర్కొంది. స్టేను ఏ సమయంలోనైనా తిరిగి ఎత్తివేసే అవకాశం ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ ప్రక్రియలో పాల్గొనేది లేదని రైతు సంఘాలు పునరుద్ఘాటిస్తున్నాయని స్పష్టం చేసింది. కమిటీలో మూడు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు, చట్టాలు మంచివని వాదించిన వారే ఉన్నారని పేర్కొంది. గతంలోనే ప్రభుత్వం చేసిన కమిటీ ప్రతిపాదనను కూడా రైతు సంఘాలు తిరస్కరించాయని గుర్తు చేసింది. మూడు చట్టాలు వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెట్లపై కార్పొరేట్ నియంత్రణకు దారితీస్తాయని రైతు నేతలు, కేంద్ర ప్రభుత్వానికి సమగ్రంగా వివరించినట్టు తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చులు, రైతులపై అధిక అప్పులు, పంట ధరలను తగ్గించడం, రైతు నష్టాలను పెంచడం, ప్రభుత్వ సేకరణను తగ్గించడం, పీడీఎస్ ముగించడం, ఆహార ఖర్చులు పెంచడం, అధిక రైతు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి మరణాలు, అప్పుల కారణంగా భూమి నుంచి బహిష్కరణకు దారితీస్తుందని వివరించినట్టు తెలిపింది. ఈ కఠినమైన వాస్తవాలను కోర్టుల ముందు దాచారని విమర్శించింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతు సంఘాలు ప్రకటించిన శాంతియుత కిసాన్ పరేడ్ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జరుగుతుందని స్పష్టం చేసింది. రైతులు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారనీ, ప్రభుత్వం దీనిపై కోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. అలాగే జనవరి 13, 18, 23 తేదీలలో ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
బహిష్కరించడమే మార్గం : ఏచూరి
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులు ఇలాంటి కమిటీతో మాట్లాడతారని ఎవరైనా ఆశించగలరా అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి మంగళ వారం ట్వీట్ చేశారు. ఇటువంటి కమిటీని బహిష్కరిం చడం తప్ప రైతులకు వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు.