Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాష్ట్ర మిలిటెన్సీ ఉద్యమంపై జనవరి 8న ప్రచురితమైన ఒక ఆర్టికల్కు సంబంధించి మణిపూర్ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. ఆ ఇద్దరు జర్నలిస్ట్లు ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నారంటూ... చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఏపీఏ) కింద వారిపై కేసు నమోదు చేసింది. సుమోటుగా తీసుకున్న మణిపూర్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 'మణిపురి న్యూస్ పోర్టల్' ఎడిటర్ ఇన్ చీఫ్ ధీరేన్ సదోక్పామ్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పోవోజెల్ చౌబాలను అదుపులోకి తీసుకున్నారు. చైబాను అరెస్ట్ చేసినట్టు దక్షిణ ఇంఫాల్ ఎస్పీ ధ్రువీకరించారు. అయితే సదోక్పామ్ అరెస్ట్పై ఆయన స్పందించలేదు. 'రివల్యూషనరీ జర్నీ ఇన్ఎ మెస్' అనే పేరుతో ఈ ఆర్టికల్ను ఎం జారు లువాంగ్ రాశారు. దీంతో ఎఫ్ఐఆర్లో ఆయన పేరును కూడా చేర్చారు. 1960 నుంచి సాయుధ వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తున్న పలు సాయుధ బలగాల తీరును విమర్శనాత్మకంగా ఈ ఆర్టికల్లో వివరించారు. సాయుధ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వలసరాజ్యాల చట్టంగా అభివర్ణించారు. మెయిల్లో వచ్చిన ఈ ఆర్టికల్ విశ్లేషణాత్మంగా ఉండటంతో.. ప్రచురించాలని నిర్ణయించుకున్నామని ఎడిటర్ ఇన్ చీఫ్ ధీరేన్ సదోక్పామ్ అన్నారు. గతంలో కూడా ప్రభుత్వాల, పోలీసుల విమర్శనాత్మక వ్యూహాలను ప్రచురించామని అన్నారు. కాగా, జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇదే మొదటిసారి కాదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతున్నది.