Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క నేతకు ముగ్గురు.. 640 మందికి ఒక్కడే పోలీస్
- దేశంలో 19,467 మంది పెద్దలకు 66 వేల మంది భద్రతా బలగాలు
ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి భద్రత గురించి పెద్దగా పట్టించుకోవటంలేదు. గంటకో లైంగికదాడి... నిమిషానికో చోరీ జరుగుతున్నా లైట్ తీసుకుంటున్నాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా బాధితులకు నిరాశే ఎదురవుతున్నది. ఇది నాణానికి ఓ వైపు. మరోవైపు చూస్తే.. వెరి ఇంపార్టెంట్ పర్సన్స్ (వీఐపీ) భద్రతపై ప్రభుత్వాలు ఎక్కడాలేని అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నాయి. ఒక్క నేతకు సగటున ముగ్గురు పోలీసు లుంటే.. 135 మంది భారతీయుల్లో 640 మందికి సగటున ఒక్కరే పోలీసు సేవలందిస్తున్నాడంటే నమ్ముతారా..! కానీ ఇది నిజం.
న్యూఢిల్లీ : పొలిటికల్ లీడర్ వెంట ఉండే భద్రత అంతాఇంతా కాదు. మఫ్టీ డ్రస్సుల్లో ఉండే పోలీసులు మొదలుకుని జెడ్ క్యాటగిరి భద్రత ఏర్పాటు చేస్తున్నాయి. అయితే మన దేశంలో వీఐపీ సంస్కృతిని అంతం చేస్తామనే చర్చ చాలా సార్లు వచ్చినా..అది జరగటంలేదు.
భద్రతను ఎవరు పర్యవేక్షిస్తారు..?
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక వింగ్ పనిచేస్తుంది. అదే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) విభాగం. ఈ విభాగం ఇచ్చిన డేటా ప్రకారం.. దేశంలో 19,467 మంది వీఐపీలు ఉన్నారు. 66,043 మంది పోలీసులు వారి సేవలో ఉన్నారని సమాచారం. అంటే ఒక్కో వీఐపీ భద్రతకు ముగ్గురు పోలీసులకు పైనే ఉన్నారు. అయితే, 135 కోట్ల జనాభా ఉన్న దేశంలో 20.91 లక్షల మంది పోలీసులు ఉన్నారు. అంటే 642 మందికి ఏక్ నిరంజన్ అనేలా ఒక్క పోలీసు సేవలందిస్తున్నాడు. అదే 2018 లో 632 మందికి ఒకడే ఉంటే ఇపుడు జనాభా సంఖ్య స్వల్పంగా పెరిగింది.
ఖాళీల సంగతేంటీ..?
జనాభాకు భద్రత కల్పించటం కన్నా వీఐపీలపైనే ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టిపెడుతున్నాయనటానికి ఎన్నో ఉదాహరణలు.. మరెన్నో సాక్ష్యాలు. వాస్తవంగా దేశంలో 26.23 లక్షల పోస్టులు ఉన్నాయి. అందులో 20.91 లక్షల పోస్టులు మాత్రమే భర్తీ చేశామని బీపీఆర్డీ తెలిపింది. ఈ లెక్కన 5.31 లక్షలకు పైగా పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
బీహార్లో అత్యధికంగా....
బీహార్లో 12 కోట్లకు పైగా జనాభా ఉంటే.. ఇక్కడ 91,862 మంది పోలీసులు ఉన్నారు. దీని ప్రకారం ఇక్కడ 1,312 మందికి ఒక పోలీసున్నాడు. ఇది దేశంలోనే అత్యధికం. డయ్యూ డామన్లో.. 4.30 లక్షల జనాభా ఉన్న 424 మంది పోలీసులు ఉన్నారు. అంటే, 1,014 మందికి ఒక పోలీస్ ఉన్నాడు.
వీఐపీలు తగ్గినా...పెరిగిన పోలీసుల సంఖ్య
వీఐపీ సంఖ్య గణనీయంగా తగ్గినా...భద్రత పేరిట కాపలాగా ఉంటున్న పోలీసుల సంఖ్య మాత్రం పెరుగుతున్నది. నాలుగేండ్ల కింద (2016లో) దేశంలో వీఐపీల సంఖ్య 20,828. వారి సేవలో 56,944 మంది పోలీసులు నిమగమయ్యారు. 2019లో ఆ సంఖ్య 19,467కు తగ్గింది, కాని వారి రక్షణలో నిమగమైన పోలీసుల సంఖ్య 66,043 కి పెరిగింది.
కేంద్రం నుంచి 450 మంది వీఐపీల రక్షణ...
భారత ప్రధానికి అందించే ఎస్పీజీ భద్రత కాకుండా, భద్రతా వ్యవస్థను నాలుగు వర్గాలుగా విభజించారు. జడ్ ప్లస్, జడ్ వై, జడ్ ఎక్స్ కేటగిరీలుగా చేశారు. జడ్ కేటగిరిలో 55 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. వీటిలో 10 కంటే ఎక్కువ ఎన్ఎస్జీ కమాండోలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి భద్రత కోసం ప్రతి నెలా రూ .10 కోట్లు ఖర్చవుతుంది. అదే సమయంలో, సీఆర్పీఎఫ్ మరియు ఐటీబీటీకి చెందిన 22 మంది సిబ్బందితో పాటు, జెడ్ కేటగిరీ భద్రతలో స్థానిక పోలీసులు ఉన్నారు.
సమాచారం పై గోప్యత
- అసలు భద్రత ఎవరికి ఇస్తున్నారని వివరాలు అడిగితే...ప్రభుత్వం నుంచే వచ్చే సమాధానం ఒక్కటే.. భద్రత.. గోప్యత కారణంగా, సమాచారం ఇవ్వలేమంటున్నది..
- భద్రా ఖర్చులెంత అని సమాచారం అడిగితే.. భద్రత కోసం చేసే ఖర్చును కచ్చితంగా వివరిం చడం కష్టం, ఎందుకంటే ఇందులో భద్రతా దళాల జీతం, భత్యాలు, కమ్యూనికేషన్, వాహన ఖర్చులు కూడా ఉన్నాయని అంటున్నది..