Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయ్యి కిలోమీటర్లకుపైగా నెట్వర్క్ పనులు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ జరిపారు. గుజరాత్లో రెండు ప్రముఖ పట్టణ కేంద్రాలకు ఈ రోజు చారిత్రకమైన రోజని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టులతో ఈ రెండు నగరాలకు పర్యావరణహిత రవాణా వ్యవస్థ 'మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం' అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపానీ, కేంద్ర హౌసింగ్, అర్బన్ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..అహ్మదాబాద్, సూరత్లు ఈరోజు రెండు బహుమతులు అందుకున్నాయని అన్నారు. దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలైన ఈ రెండు నగరాల మధ్య మెట్రో ప్రాజెక్టుతో వాణిజ్య అనుసంధానం మరింత పటిష్టమవుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణపరంగా గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు తేడా ఏమిటో స్పష్టంగా అవగతం చేసుకోవచ్చని అన్నారు. 2014కు ముందు 10-12ఏండ్ల వ్యవధిలో కేవలం 225 కిలోమీటర్ల మెట్రోలైను అందుబాటులోకి వస్తే గత ఆరేండ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ కార్యరూపంలోకి వచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో మెట్రో నెట్వర్క్ గురించి ఆధునిక ఆలోచనలు లేవని, మెట్రో విధానమనేదే లేదన్నారు. ఫలితంగా వివిధ నగరాల్లో వివిధ రకాల మెట్రోలు ఉండేవన్నారు. తాము నగరాల్లోని రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశామని, ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తెచ్చామని చెప్పారు. బస్సు, మెట్రో, రైల్ వ్యవస్థను కలెక్టివ్ సిస్టంగా అభివృద్ధి చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు.