Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాక్టర్స్ పరేడ్ నిర్వహించి తీరుతాం
- ఢిల్లీ పోలీసులకు రైతు నేతలు స్పష్టం
- రైతులతో 21న సుప్రీం కమిటీ భేటీ
- నేడు పదో విడత చర్చలు
- 55వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీలో శాంతియుత ట్రాక్టర్స్ పరేడ్ నిర్వహణపై రాజీపడే ప్రసక్తి లేదని, నిర్వహించి తీరుతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రైతు నేతలను కలిసిన ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేశారు. అనంతరం రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. తాము ''కిసాన్ రిపబ్లిక్ పరేడ్''కు సిద్ధం చేసిన ప్రణాళిక మార్చే ప్రసక్తి లేదని బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నారు. అవుటర్ రింగ్రోడ్డులో జరిగే పరేడ్ రైతుల జీవనశైలికి సంబంధించినదని, ప్రశాంతమైన ట్రాక్టర్ల మార్చ్కు తాము సిద్ధమవుతున్నామని, రూట్ప్లాన్లో ఎలాంటి మార్పూ ఉండదని అన్నారు. ఢిల్లీ, హర్యానా ఉన్నతాధికారులు రైతు నాయకులకు ప్రత్యా మ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారని, రైతులు అవుటర్ రింగ్రోడ్డుపై నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్స్ పరేడ్ వల్ల ట్రాఫిక్, ఇతర అడ్డంకులను వారు చూపారని తెలిపారు. ''మేము మూడు అంశాలపై స్పష్టంగా ఉన్నాము. పరేడ్ ప్రణాళికాబద్ధమైన మార్గంలో ఉంటుంది. దానిలో మార్పుకు అవకాశం
లేదు. ఇది ఢిల్లీ లోపల ఉంటుంది. పూర్తిగా శాంతియుతంగా ఉంటుంది'' అని యోగేంద్ర యాదవ్ చెప్పారు.మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహ ద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతున్నది. మంగళవారం నాటికి 55వ రోజుకు చేరుకుంది. అదేవిధంగా మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించడానికి సుప్రీంకోర్టు ఇటీవల నియమించిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం నాడిక్కడ స్థానిక పూసా ఇన్స్టిట్యూట్లో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ అశోక్ గులాటి, షెట్కారీ సంఘటనా అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ దక్షిణాసియా మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ జోషి రోడ్మ్యాప్ గురించి చర్చించారు. తమ కమిటీ మొదటి సంప్రదింపుల సమావేశం గురువారం జరుగుతుందని సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. రైతులు తమ సదుపాయం మేరకు ప్రత్యక్షంగా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఈ సమావేశంలో పాల్గొనవచ్చునని చెప్పారు. నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడి, వారికి నచ్చజెప్పాలని తాము కోరుకుంటున్నామన్నారు. వారు హాజరుకాకపోతే, తాము వారి వద్దకు వెళ్లే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
భేటీ కంటే ముందే చట్టాలకు అనుకూలంగా వ్యాఖ్యలు
కమిటీ సభ్యుడు, మహారాష్ట్రకు చెందిన షెట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వత్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ సంస్కరణ లు ప్రస్తుతం చాలా అవసరమని, ఈ చట్టాలను ఇప్పుడు రద్దు చేస్తే, ఇటువంటి సాహసం మరే రాజకీయ పార్టీ మరో 50 ఏండ్ల వరకు చేయబోదని అన్నారు. గడిచిన 70 ఏండ్లలో అమలైన చట్టాలు రైతుల ప్రయోజనాలకు అనుగుణమైనవి కాదని, దాదాపు 4.5లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకు న్నారని చెప్పారు. రైతులు నిరుపేదలవుతున్నారని, రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. కొన్ని మార్పులు అవసరమని, ఆ మార్పులు జరు గుతున్నాయని, కానీ నిరసనలు ప్రారంభమయ్యా యని అన్నారు. వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న దేశంలోని రైతులు, రైతుల సంఘాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని అన్నారు. సంబంధిత రైతులందరి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి కమిటీ ఆసక్తిగా ఉందని, తద్వారా ఇది భారత రైతుల ప్రయోజనాలకు ఖచ్చితంగా ఉపయోగపడే సలహాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
నేడు పదో విడత చర్చలు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 40 రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో చర్చలు జరిపింది. ఈ చట్టాలను రద్దు చేసేందుకు విముఖత చూపుతూ, వీటిని సవరించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని రైతులను కోరుతున్నది. కానీ రైతులు వీటిని రద్దు చేసి తీరాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో 10వ విడత చర్చలు బుధవారం జరగబోతున్నాయి. ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలు జరగనున్నాయి.