Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది దుర్మరణం
- 18 మందికి గాయాలు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయిగురి జిల్లా దుప్గురి నగరంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో బండ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు నియంత్రణ కోల్పోయి పెళ్లి బృందంతో వెళ్తున్న మూడు కార్లపై పడింది. ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులేనని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్... నియంత్రణ కోల్పోవడంతో.. డివైడర్ను తాకి.. అటుగా వస్తున్న మూడు కార్లపై పడిందని పోలీసులు తెలిపారు. ట్రక్కులో ఉన్న ఆ రాళ్లు కూడా వాహనాలపై పడ్డాయని చెప్పారు. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ట్రక్కుకు ముందు వైపు ఉన్న మరో చిన్న లారీ కూడా దెబ్బతిందని, మొత్తంగా నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ 2.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ 50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.25 వేలు పరిహారం ప్రకటించారు.