Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంతో చర్చలపై కార్మికసంఘాల పెదవివిరుపు
- లేబర్ కోడ్లు సస్పెండ్ చేసి తాజాగా చర్చలు జరపాలని డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాలతో లేదా పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరపకుండా ప్రభుత్వం ఆమోదించిన కార్మిక కోడ్లకు నిబంధనలను రూపొందించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను, చర్యలను కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. 40 కార్మిక చట్టాలను మిళితం చేసి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించాలని ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రకార్మిక సంఘాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. బుధవారం కార్మిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి పది కార్మిక సంఘాలు సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, ఎఐయుటియుసి, టియుసిసి, హెచ్ఎంఎస్, ఎస్ఇడబ్ల్యుఎ, ఎఐసిసిటియు, ఎల్పిఎఫ్, యుటియుసి నేతలు హాజరయ్యారు. ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండా, చట్టాల ముసాయిదా రూపకల్పనలో యూనియన్ల ప్రమేయం లేకుండా వున్న సమయంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను పబ్లిక్ డొమైన్లో వుంచినపుడు కేంద్ర కార్మిక సంఘాలు ప్రతిపాదనలు చేశాయని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వారు విమర్శించారు. పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేసిన ముసాయిదా లేబర్ కోడ్లను కేబినెట్ ఆమోదించడం, తర్వాత పార్లమెంట్లో ఆమోదించడం వల్ల పార్లమెంటరీ పద్ధతులన్నీ నీరుగారాయని పేర్కొన్నారు.
లేబర్ కోడ్లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సులను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఐఎల్ఓ నిబంధనలకు అనుగుణంగా ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక చర్చల పట్ల ప్రభుత్వం సీరియస్గా లేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే సస్పెన్షన్లో పెట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ తర్వాత ప్రతి ఒక్క లేబర్ కోడ్పై కేంద్ర కార్మిక సంఘాలతో తాజాగా చర్చలు ప్రారంభించాలని కోరాయి.
తాజాగా జరిగిన సమావేశాన్ని తాము ఆమోదించ బోమని, మభ్యపెట్టే సంప్రదింపులుగా మాత్రమే మిగిలా యని వ్యాఖ్యానించింది. గత ఐదేళ్లుగా ఐఎల్సి (భారత కార్మిక మహాసభ) సమావేశాన్ని నిర్వహించకపోవడం పట్ల కూడా కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.