Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యంతర ఉత్తర్వులు జారీ
అమరావతి: విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్ భూముల వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తునకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. సిట్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ కాలపరిమితి ముగిసిందని తాము ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చామని, అందుకే వారం రోజుల వరకూ వాల్తేర్ క్లబ్పై కఠిన చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తులో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని గత నెల 27న ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వాల్తేర్ క్లబ్ అధ్యక్షులు ఫణీంద్రబాబు హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జయసూర్య విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సిట్ ఎదుట ఫణీంద్రబాబు హాజరై అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత ఈ నెల 20న మళ్లీ హాజరుకావాలని సిట్ నోటీసు ఇచ్చిందని పిటిషనరు తరపున సీనియర్ న్యాయవాది డివి సీతారామమూర్తి చెప్పారు. సిట్ను 2019లో ప్రభుత్వం మూడు నెలల కాలపరిమితికి ఏర్పాటు చేసిందని, దాని కాలపరిమితి ముగిసిందని, సిట్ తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, సిట్ దర్యాప్తుపై తక్షణమే స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
దీనిపై ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పందిస్తూ... సిట్ కాలపరిమితి ముగిసిందో లేదో తెలుసుకుని చెప్పేందుకు ఒకట్రెండు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. సిట్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులుంటే చూపాలని, లేనిపక్షంలో వారం రోజులపాటు వాల్తేర్ క్లబ్పై చర్యలు తీసుకోరాదని హైకోర్టు తెలిపింది. విచారణ గురువారానికి వాయిదా పడింది.