Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ రేపు భేటీ..
- ఏడాది, ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల అమలు ఆపుతాం : కేంద్ర ప్రభుత్వం
- వచ్చే సమావేశంలో అభిప్రాయాన్ని చెబుతాం : రైౖతు నేతలు
- ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రైతు సంఘాల నిలదీత
- సుదీర్ఘంగా చర్చలు.. పదోసారి అసంపూర్తిగానే..
రైతు ప్రతినిధి బృందాలు..కేంద్రం మధ్య పదిసార్లు చర్చలు జరిగినా మోడీ సర్కార్ మొండికేస్తున్నది. దీంతో మళ్లీ రేపు (శుక్రవారం) రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరగనున్నాయి. బుధవారం జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాకపోవడంతో అసంపూర్తిగానే ముగిశాయి. మూడు వ్యవసాయ చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు నిలుపుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం అన్నది. మాటమార్చే మోడీ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనపై చర్చించి.. వచ్చే సమావేశంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
న్యూఢిల్లీ : కేంద్రం రైతుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. బుధవారం స్థానిక విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్ హాజరవ్వగా, 40 మంది రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. హన్నన్ మొల్లా (ఏఐకేఎస్), గుర్నామ్ సింగ్ (బీకేయూ), శివ కుమార్ (మధ్యప్రదేశ్), మేజర్ సింగ్ పునివాలా (ఏఐకేఎస్, పంజాబ్), దర్శన్ పాల్, జగ్మోహన్ సింగ్, సత్నామ్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాలా, జగ్జీత్ సింగ్ దళ్లేవాల్, కవితా కూరగంటి, రాకేశ్ తికాయత్, హర్బల్ సింగ్ , అంచావతా, అభిమన్యు కుహర్ తదితర నేతలు హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు జరిగిన చర్చల్లో మూడు సార్లు విరామం ఇచ్చారు. ఈ విరామం సమయంలో కేంద్ర మంత్రులు విడిగా సమావేశమయ్యారు. సమావేశం అయిన వెంటనే ఎన్ఐఏ దాడులపై రైతు నేతలు లేవనెత్తారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర హౌం శాఖ మంత్రితో మాట్లాడి ఎన్ఐఏ దాడులపై అంశంపై చర్చిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరపై ఈ చర్చించారు. ఎంఎస్పీ, మూడు చట్టాలపై కమిటీ వేస్తామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. కమిటీ నివేదిక ఇచ్చే వరకు ఏడాది, ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలపై నేడు (గురువారం) సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల సమావేశం జరుగుతుంది. అన్ని రైతు సంఘాల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
రైతులపై ఎన్ఐఏ కేసులు ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వ ప్రతిపాదనపై నేడు నిర్ణయం : హన్నన్ మొల్లా
రైతులపై ఎన్ఐఏ నమోదు చేసిన నకిలీ కేసులను ఉపసంహరించు కోవాలని తాము ప్రభుత్వాన్ని కోరా మనీ, దీనికి స్పందించిన కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని పరిశీలిస్తా మని చెప్పినట్టు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై నేడు (గురువారం) నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, మూడు చట్టాలపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపిందని, ఆ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని చెప్పిందని అన్నారు. ఒకటిన్నర సంవత్సరాల పాటు చట్టాల అమలును నిలిపివేస్తామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపిందని అన్నారు. కొత్త కేసులు నమోదు చేయబడిన నాయకుల పేర్లను అందించమని తమను కోరినట్టు చెప్పారు.