Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 9 ట్రిలియన్ డాలర్ల నష్టం
- అమెరికా, కేనడా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలపైనే భారం
- ఆర్థిక సంక్షోభం తొలగాలంటే.. పేద దేశాలకు టీకాలు అందాల్సిందే
- ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అకాడమిక్ అధ్యయనం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతూనే ఉంది. అయితే, ఇటీవలే కరోనా కట్టడి చేయడానికి అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటివరకు సంపన్న, మధ్య ఆదాయం కలిగిన కొన్ని దేశాల్లో మాత్రమే ప్రారంభమైంది. అయితే, పేద దేశాలకు ఇది అందని ద్రాక్షలాగానే మారింది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కరోనా టీకా డోసులను కొన్ని సంపన్న దేశాల చేతిలోనే ఉండిపోవడంతో తీవ్ర అసమానతలు నెలకొంటున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారుకుంటుందుని అకాడమిక్ నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది మధ్యకాలం నాటికి సంపన్న దేశాల్లో టీకా ప్రక్రియ పూర్తి అయినప్పటికీ.. పేద దేశాలకు టీకాలు అందకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 9 ట్రిలియన్లకు మించి నష్టాలు చవిచూసే అవకాశముంటుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ భారంలో సగానికి పైగా అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలే భరించాల్సి వస్తుందని తెలిపింది. అయితే, వర్థమాన దేశాలు ఈ ఏడాది చివరికల్లా తమ జనాభాలో సగం మందికి వ్యాక్సిన్ అందించిన సందర్భంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా నష్టం 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.8 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ నష్టంలో సగానికి పైగా సంపన్న దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందని అధ్యయనం పేర్కొంది.
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించిన ఈ అధ్యయన.. కరోనా టీకాల సరఫరాలో అసమానత కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది. పేద దేశాలకు టీకాలు అందించడం దాతృత్వం మాత్రమే అనే విషయాన్ని తీవ్రంగా మందలించింది. అన్ని ఆర్థిక వ్యవస్థలు అనుసంధానించబడ్డాయి కాబట్టి టీకాల అంతరాన్ని తొలగించడానికి ధనిక దేశాలు ప్రయత్నిస్తే ఈ భారం తగ్గే అవకాశముంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు తమ దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలనుకుంటే పేద దేశాలకు టీకాలు అందేలా చేయడం.. అత్యావశ్యకమైన పెట్టుబడి లాంటిదని తెలిపింది. అలాగే, ఇతర ఆర్థిక వ్యవస్థలు కోలుకునే వరకూ ఏ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కోలుకోలేదని ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న ఇస్తాంబుల్లోని కోక్ వర్సిటీ ప్రొఫెసర్, ఆర్థికవేత్త సెల్వా డెమిరాల్ఫ్ వెల్లడించారు. ఎందుకంటే వాణిజ్యంగా గ్లోబల్ చైన్తో ముడిపడి ఉందని అన్నారు.