Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమానికి వెల్లువెత్తుతున్న మద్దతు
- ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ఎత్తుగడలు : రాజకీయ విశ్లేషకులు
- పంజాబ్, హర్యానాకే పరిమితమన్నారు..
- ఖలిస్తాన్..వేర్పాటువాదులున్నారన్నారు..
- దఫ..దఫాలుగా చర్చలుసాగించి కాలయాపన
- రిపబ్లిక్ డే 'ట్రాక్టర్ ర్యాలీ'ని ఆపేయటమే కేంద్రం లక్ష్యం..
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమం కేంద్రంలోని పాలకులకు కొరకరాని కొయ్యలాగా తయారైంది. అంగబలం, అర్థబలం ప్రయోగించినా..ఉద్యమం నీరుగారటం లేదన్న భావన బీజేపీ పెద్దల్లో కనపడుతోంది. తీవ్రమైన ప్రతికూ వాతావరణ పరిస్థితులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చే తాకిడిని తట్టుకొని ఉద్యమం నిరాఘాటంగా కొనసాగటం దేశ ప్రజల్ని కదలిస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఎంతోమంది రైతులు తమ ప్రాణాల్ని సైతం ఫణంగాపెట్టి ఉద్యమంలో నిలబడటం అందర్నీ ప్రభావితం చేసింది. అత్యంత శక్తివంతమైన రాజకీయ కేంద్రమైన ఢిల్లీని రైతులు చుట్టుముట్టారు. శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ శివార్లలోని గ్రామాలకు చెందిన సాధారణ ప్రజలు...ఆహారం, నీరు, వేడిపాలు, బిస్కెట్లు..మొదలైనవి నిరసనకారులకు అందజేస్తున్నారు. రైతు ఉద్యమానికి తమవంతు సాయం అందజేస్తున్నారు. గణతంత్ర దినోత్సవంనాటికి ఉద్యమం మరో స్థాయికి చేరుకుంటుందని కేంద్రానికి సంకేతాలు అందాయి.
ఢిల్లీకి పరిమితం కాలే..
రైతు ఉద్యమం కేవలం ఢిల్లీ శివార్లకు పరిమితం కాలేదు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు కావాలని పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే డిమాండ్ చేయటం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం డిమాండ్ చేస్తోంది. కాంట్రాక్ట్ సాగు, పంట ఉత్పత్తుల నిల్వ, కొనుగోళ్లు, ధరలు..మొదలైనవన్నీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడానికి నూతన వ్యవసాయ చట్టాలు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ విషయం దేశ రైతాంగానికి స్పష్టంగా అర్థమైంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్..తదితర రాష్ట్రాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని రోడ్లమీదకొచ్చి తమ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్భవన్ ముందునుంచి వెళ్తూ..తమ డిమాండ్లను గవర్నర్లకు తెలియజేశారు. కేరళ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీ శివార్లకు చేరుకొని..జాతీయ రహదార్లపై ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నవారూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా తమకేమీ పట్టనట్టు మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది.
అరెస్టులు..గూండాయాక్ట్లు..
రైతు ఉద్యమం నీరుగార్చేందుకు మోడీ సర్కార్లో పెద్ద తలకాయలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నాయి. ఉద్యమం కేవలం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకే పరిమితమని, ఖలిస్తాన్ ఉద్యమమని...మొదట్లో తేలిగ్గా కొట్టిపారేశారు. తర్వాత ఉద్యమంలో రైతులు పాల్గొనకుండా ఎక్కడికక్కడ బెదిరింపులు, పోలీసులు అరెస్టులు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో రైతు సంఘం నాయకుల్ని పాలకులు పెద్దఎత్తున బెదిరించారు. యూపీలో అయితే గూండాయాక్ట్ ప్రయోగించి అరెస్టులు సైతం చేశారు.
ఇక ఢిల్లీలో ఎక్కడికక్కడ బారికెడ్లు బిగించి ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలీసులను పెద్దఎత్తున ప్రయోగించారు. రోజు రోజుకీ ఉద్యమంలో పాల్గొనే రైతులు సంఖ్య పెరగటం పాలకుల్ని ఆందోళనకు గురిచేసింది. దాంతో రాష్ట్రాల నుంచి రైతలు రాకపోకలను అడ్డగించే చర్యలు చేపట్టారు.
ప్రతిపక్షాలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని స్వయంగా ప్రధాని మోడీ మీడియా ముఖంగా వచ్చి చెప్పారు. చివరికి సుప్రీంకోర్టును సైతం రంగంలోకి దించి..రైతుల పట్టుదలను, మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎత్తుగడలు వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుదారులైన సభ్యులతో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ వేయటం...పాలకుల ఎత్తుగడను రైతు సంఘాలు గ్రహించాయి. ఈ పాచిక పారలేదనే సంగతి కొద్ది రోజుల్లోనే కేంద్రం గ్రహించింది.
ట్రాక్టర్ ర్యాలీ కీలకం..
పది రౌండ్ల చర్చలు నడిచాకగానీ..రైతుల ఉద్యమం ఉధృతిని కేంద్రంలోని పెద్దలు గ్రహించలేకపోయారని సమాచారం. దాంతో ఈ ఉద్యమంలో తదుపరి ఘట్టాల్ని వెంటనే అడ్డుకోవాలన్న తలంపుతో వ్యూహాన్ని మార్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని ఎలాగైనా రద్దు చేయాలని, కొత్త ప్రతిపాదనలతో (18 నెలలు చట్టాలు అమలు ఆపేస్తాం..) కేంద్రం ముందుకు వచ్చింది. ఇక 11 రౌండ్ చర్చలకు వచ్చేసరికి కేంద్రం వైఖరి పూర్తిగా అర్థమైంది. ఒకరకమైన అహంకార పూరిత ధోరణి కేంద్రంలో కనపడింది. చేయిల్సిందంతా చేశాం..మీ ఇష్టం..అనే విధంగా కేంద్రం మాట్లాడింది. ప్రజల్లో ఒక సానుభూతి పొందడానికి వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.