Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని ఎంచుకునే విషయంలో యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత యూజర్ల పట్ల వాట్సాప్ యాప్ భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాలను వివరిస్తూ.. ఇది ఆందోళన కలిగించే అంశమని ఢిల్లీ హైకోర్టుకు సోమవారం వివరించింది. భారత యూజర్లపై వాట్సాప్ తన ప్రైవసీ పాలసీలో మార్పును ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరమని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. ఫేస్బుక్ నేతత్వంలోని వాట్సాప్ నూతన ప్రైవసీ విధానానికి వ్యతిరేకంగా ఇటీవల దాఖలైన ఓ పిటిషన్ విచారణ తాజాగా జరిగింది. ఈ క్రమంలోనే అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ సచ్దేవ్ ఎదుట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. తమ డేటాను ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఫేస్బుక్, వాట్సాప్ల్లో షేర్ చేయకుండా ఉండే అవకాశాన్ని భారత వినియోగదారులకు ఇవ్వకపోవడాన్ని శర్మ ఎత్తిచూపారు. ఇది వనియోగదారుల సమాచార గోప్యత, భద్రత, రక్షణకు భంగం కలిగించే విషయమని కోర్టుకు వివరించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్థిష్ట సమాచారం అందచేయాలని వాట్సాప్ను కోరిందని తెలిపారు. ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు మార్చి 1కి వాయిదా వేసింది.