Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతానికి మార్గదర్శకాలు.. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు
- హెల్ప్లైన్ నంబర్ 7428384230 కేటాయింపు
- ఢిల్లీలో ఆరు రూట్లల్లో పరేడ్
- ట్రాక్టర్లపై రైతు జెండాలతో పాటు జాతీయ జెండాలు
- రాజధాని సరిహద్దుల్లో భారీగా ట్రాక్టర్లు
- రాష్ట్రాల నుంచి తరలొచ్చిన అన్నదాతలు
- చరిత్రను సృష్టించబోతున్నాం : రైతు సంఘాల నేతలు
- కోట్లాది మంది హృదయాలను గెలవడమే ముఖ్యం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు మరో చరిత్రను సష్టించబోతున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రైతులు లక్షలాది ట్రాక్టర్లతో '' కిసాన్ రిపబ్లిక్ పరేడ్'' నిర్వహించబోతున్నారు.
ఈ పరేడ్కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రైతులు హాజరవుతున్నారు. ఇప్పటికే రైతులతో దేశ రాజదాని సరిహద్దులు నిండిపోయాయి. అన్నదాతలు చేపట్టే కిసాన్ పరేడ్ లో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన మంజీందర్ సింగ్, తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి రైతులను ఏకం చేశారు. ముఖ్యంగా గ్వాలియర్, అశోక్ నగర్, మోరేనా, శిప్పురి నుంచి దాదాపు పదివేల ట్రాక్టర్లతో ఢిల్లీ చేరారు. కేవలం ఢిల్లీ సమీప రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్ ర్యాలీలు చేపడుతారని, వీటి సంఖ్య లక్షల్లో ఉండనుందని రైతు సంఘం నేత ధర్మేంద్ర మాలిక్ వెల్లడించారు.
కేవలం ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న రైతులు మాత్రమే ఈ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలు ట్రాక్టర్స్ పరేడ్లో రైతులు పాల్గొనబోతున్నారని కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. ఈ పరేడ్ ద్వారా వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లను దేశానికి, ప్రపంచానికి చెప్పేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా పరేడ్ నిర్వహిస్తూ తమ లక్ష్యం ఢిల్లీని జయించడం మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలవడమని అన్నారు.
ఆరు రూట్లల్లో పరేడ్ 300 కిలో మీటర్ల మేర ర్యాలీ
కిసాన్ రిపబ్లిక్ పరేడ్ కు ఆరు సరిహద్దు ప్రాంతాల నుంచి రూట్లు నిర్ణయించారు. అందులో మూడు పెద్దవి, మూడు చిన్నవి ఉన్నాయి. రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్ నుంచి ట్రాక్టర్ పరేడ్ బయలుదేరనుంది. ఈ మూడు సరిహద్దు మార్గాల్లో దాదాపు 300 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ పరేడ్ కొనసాగనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల అనంతరం దాదాపు 11గంటలకు రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభంకానుంది.
సింఘు బోర్డర్ నుంచి కహర్ హొడా టోల్ ప్లాజా వరకు మొత్తం 63 కిలోమీటర్ల ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన ట్రాక్టర్స్ పరేడ్ ఎస్జిటీ నగర్, డీటీయూ షాహాబాద్, ఎస్బి డైరీ, భర్వాలా, పూత్ ఖుహర్డ్, భావన టీ పాయింట్, కుంఝావాలా చౌక్, కుతబ్ గఢ్, అచ్చందీ బోర్డర్ మీదు సాగి కహర్ హొడా టోల్ ప్లాజా వద్ద ముగుస్తుంది.
టిక్రి నుంచి అసోడా టోల్ ప్లాజా వరకు మొత్తం 62.5 కిలో మీటర్లు ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారు. టిక్రీ సరిహద్దు వద్ద ప్రారంభమైన కిసాన్ పరేడ్ నంగ్లోయి, బాప్రోలా విలేజ్, నజఫ్ ఘడ్, ఝారోడా బోర్డర్, రోతక్ బైపాస్ మీదుగా సాగి అసోడా టోల్ ప్లాజా వద్ద ముగుస్తుంది.
ఘాజీపూర్ నుంచి ఘాజీపూర్ సరిహద్దు వరకు 68 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ జరగనుంది. ఘాజీపూర్ వద్ద ప్రారంభమైన కిసాన్ పరేడ్ అప్సర బోర్డర్, హాపూర్ రోడ్డు, ఐఎంఎస్ కాలేజ్, లాల్కున్ మీదుగా సాగిన ట్రాక్టర్స్ మార్చ్ తిరిగి ఘాజీపూర్ వద్దకు చేరుకుంది.
షాజహాన్పూర్ సరిహద్దులో ప్రారంభమైన కిసాన్ పరేడ్ బావల్, మనేసర్ మీదుగా సాగి మళ్ళీ షాజహాన్పూర్కు చేరుకుంటుంది. మేహావాట్ రూట్ లో సున్హేడా జూర్హేడా బోర్డర్ లో ప్రారంభమైన పునహానా, పిన్గ్వాన్, బాడకలి, నూహా, బిడపూర్ చౌక్, ఉటవాడ మూడ్, కోట్ మీదుగా సాగి మళ్ళీ పునహానాకు చేరుకుంటుంది. చిల్లా బోర్డర్ రూట్ లో చిల్లా బోర్డర్ లో ప్రారంభమై క్రిలోవన్ ప్లాజా రెడ్ లైట్, డిఎన్ డి ప్లైవే, మెయిన్ దాద్రీ రోడ్డు, దాద్రీ రోడ్డు మీదుగా పరేడ్ సాగి చిల్లా బోర్డర్ లో ముగుస్తుంది.
పరేడ్కు సూచనలు
పరేడ్పై గందరగోళం పడొద్దని, సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందితో పంచుకోవాలని రైతు సంఘాల నేతలు సూచించారు. ఏదైనా గందరగోళం ఉంటే ఆయా రైతు సంఘాల నాయకులను సంప్రదించాలని, హెల్ప్లైన్ నంబర్ 7428384230 కు కాల్ చేయాలని సూచించారు.
1. పరేడ్ లో ట్రాలీలు అనుమతించబడవు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు మాత్రమే అనుమతించబడతాయి. ప్రత్యేక పట్టిక ఉన్న ట్రాలీలకు మినహాయింపు ఉంటుంది.
2. 24 గంటలకు సరిపడా రేషన్, నీరు ప్యాక్ చేసుకోవాలి. చలి నుంచి రక్షణ కోసం మీకు సరైన ఏర్పాట్లు చేసుకోవాలి.
3. ప్రతి ట్రాక్టర్ రైతు సంఘాల జెండాలతో పాటు జాతీయ జెండాను అమర్చాలి. ఏ రాజకీయ పార్టీ జెండా ఉండదు.. ఎవరు ఎలాంటి ఆయుధాన్ని తీసుకెళ్లవద్దు. కర్రలు కూడా వేయకండి. రెచ్చగొట్టే, ప్రతికూల నినాదాలతో బ్యానర్లను ఉపయోగించవద్దు.
5. మీరు కవాతులో పాల్గొన్నట్ల్టుతెలియ జేయాలనుకుంటే 8448385556 కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
6. పరేడ్ను రైతు నాయకుల ఉండే కార్లతో నడిపిస్తారు. ఏ కారు, ట్రాక్టర్ ఆ కారును అధిగమించకూడదు. దయచేసి ఆకుపచ్చ జాకెట్లు ధరించిన వాలంటీర్ల సూచనలను అనుసరించాలి
7. పరేడ్ కోసం మార్గం ముందుగా నిర్ణయించబడింది. పోలీసులు, ట్రాఫిక్ వాలంటీర్ల మార్గనిర్దేశాన్ని పాటించాలి.
8 ఏదైనా కారు, ట్రాక్టర్ ఏ కారణం లేకుండా ఒక ప్రాంతాన్ని ఆగిపోతే ఆ కారు, ట్రాక్టర్ వాలంటీర్లచే తొలగించబడుతుంది. పరేడ్లోని అన్ని కార్లు, ట్రాక్టర్లు పరేడ్ పూర్తయిన తరువాత ప్రారంభ స్థానానికి తిరిగి చేరుకుంటాయి..
9. డ్రైవర్ సహా గరిష్టంగా 5 మంది ఒక ట్రాక్టర్లో ప్రయాణించవచ్చు. ట్రాక్టర్ల బోనెట్, బంపర్, పైకప్పుపై ఎవరూ ప్రయాణించరు. మిగిలిన వారు ఆందోళన ప్రాంతాల్లోనే ఉండాలి.
10. అన్ని ట్రాక్టర్లు తప్పనిసరిగా ఒక లైన్లో కొనసాగాలి, కవాతుకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుల వాహనాలను దయచేసి అధిగమించవద్దు.
11. దయచేసి ట్రాక్టర్లో పాటలు వేయవద్దు. పరేడ్లో ప్రతిఒక్కరూ ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ప్రకటనలు వినిపించాలి.
12. పరేడ్ కు ముందు, పరేడ్ సమయంలో బాణాసంచా వాడటం నిషేధం. మాదక ద్రవ్యాలను కలిగి ఉన్న, తినేవారిని అడ్డుకోవడం జరుగుతుంది.
13. పరేడ్ను మనోహరంగా నిర్వహించడం. తోటి పౌరుల హదయాలను గెలుచుకోవడమే ఉద్దేశం. పోలీసులు ఎలాంటి గొడవలకు పాల్పడకూడదు. అన్ని వార్తా ఛానెళ్ల ప్రతినిధులను గౌరవించాలి.
14. చెత్తను రోడ్లపైకి విసిరి పరిసరాలను కలుషితం చేయవద్దు. వ్యర్థాలను పారవేసేందుకు ఒక సంచిని తీసుకెళ్లాలి.
అత్యవసర పరిస్థితులకు మార్గదర్శకాలు
కిసాన్ ఏక్తా మోర్చా ఏరకమైన అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నిబంధనలు విధించింది.
1. పుకార్లను విస్మరించండి. ఏదైనా తనిఖీ చేయాలనుకుంటే, ఏదైనా ధ్రువీకరించాలనుకుంటే, వాస్తవాన్ని తెలుసుకోవడానికి కిసాన్ ఏక్తా మోర్చా ఫేస్బుక్ పేజీలో చూడాలి
2. పరేడ్లో అంబులెన్సులు సమీపంలో ఉంటాయి. ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలి. సమీప వాలంటీర్ను సంప్రదించాలి.
3. ట్రాక్టర్, కారుతో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని ప్రక్కన ఉంచి, వాలంటీర్ను సంప్రదించండి. లేకపోతే హెల్ప్లైన్కు కాల్ చేయండి.
4. ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే, దానిని 112 నంబర్ వద్ద ఉన్న పోలీసు కంట్రోల్ రూమ్కు నివేదించాలి.