Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్ధులు, యువతపై వీరంగం
- జలఫిరంగులు.. లాఠీచార్జి
- ఉచితవిద్య, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ప్రదర్శన
పాట్నా : ఉచిత విద్య, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో వామపక్ష విద్యార్థులు, యువకులు నిర్వహించిన ర్యాలీపై పోలీసులు విరుచుకుపడ్డారు. బీహార్ అసెంబ్లీవైపు ర్యాలీగా వెళుతున్న విద్యార్థులు, యువతను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. లాఠీలతో బాదారు. దాంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల దాడిలో అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పాట్నా మెడికల్ కళాశాలలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాట్నాకు కేంద్రమైన గాంధీ మైదాన్ నుంచి శాంతియుతంగా బయలుదేరిన వారిని జెపి గొలంబర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. రాజ్యాంగ విరుద్ధంగా తామేమీ చేయలేదనీ, ఉద్యోగాలు కల్పించాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు ప్రతాపం చూపించారని సీపీఐ(ఎంఎల్) ఎంఎల్ఏ అజిత్ కుష్వాక్ తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం పెద్ద అబద్ధమని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే రుజువైంది. అంతేకాదు, ఇప్పటికే 19 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ మరో ప్రభుత్వం మరో పెద్ద అబద్ధమాడుతున్నదని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సందీప్ సౌరబ్ ఆరోపించారు.