Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీజీ... మాకు వ్యాక్సిన్ అక్కర్లేదు!
- మా ఉక్కు సంకల్పమే కరోనా నుంచి రక్ష
- రైతు వ్యతిరేక చట్టాలపై గర్జించిన కర్షకలోకం
- టిక్రీలో రోడ్డుపైనే శౌచాలయాల నిర్మాణం
- ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు పంజాబ్ అసెంబ్లీ సంతాపం
- సాగు చట్టాలకు ప్రధాని మళ్ళీ సమర్థన
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాని మోడీ వేసుకున్నట్టు తమకు కరోనా టీకాలు అక్కరలేదని సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు ఉద్ఘా టించారు. తమ ఉక్కు సంకల్పమే కరోనా నుంచి దానికంటే ప్రమాదకరమైన ఈ ఖేతి కానూన్ల నుంచి కాపాడుతుందని ధీమా వ్యక్తంచేశారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో పీఎం మోడీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు తీవ్రంగా స్పందించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కర్షక లోకం తుది శ్వాసవిడిచే వరకూ పోరాడుతుం దనీ, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జిస్తుం దని పునరుద్ఘాటించారు. ప్రధాని మోడీ కంటే కూడా వయ స్సులు పెద్దవారు అనేకమంది రైతులు ఉద్యమ స్థలిలో ఉండి పోరాడుతున్నారనీ, అయి నా తమకేం వ్యాక్సిన్ అవసరమే లేదని స్పష్టం చేశారు. 'అంటువ్యాధి మా ఆందోళనకు ఏమా త్రం అడ్డంకి కాదు' అని ఢిల్లీ సరిహద్దు టిక్రీ వద్ద ఆందోళనలో ఉన్న 75 ఏండ్ల వృద్ధ రైతు చెప్పారు. కాగా, ఇది సర్వత్రా చర్చనీయాంశ మైంది. అసలు తనకు కరోనానే రాదని, తనది కష్టంతో కూడుకున్న శరీరమని అన్నారు.
96వ రోజుకు ఉద్యమం..
పార్లమెంట్లో అప్రజాస్వామికంగా ఆమోదించుకున్న మూడు సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, రైతన్నలు పండించిన పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఘాజీపూర్, పల్వాల్, ఢిల్లీ-హర్యానా-రాజస్థాన్ సరిహద్దు ప్రాంతం షాజహాన్పూర్లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 96 రోజుకు చేరింది. వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు యత్నిస్తున్నారు.
టిక్రీవద్ద శాశ్వత శౌచాలయాలు
సాగు వ్యతిరేక చట్టాలపై ఉధతంగా పోరాడుతున్న రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో శాశ్వత శౌచాలయాల నిర్మాణానికి పూనుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నుటువంటి బ్రాతురూమ్లు సరిపోవడం లేదనీ, దానికితోడు ఉద్యమిస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అన్నదాతల ఆందోళనల పట్ల మోడీ సర్కారు వైఖరిని గమనిస్తే తమ డిమాండ్ల పట్ల ఏమాత్రం స్పందించకపోవడంతో ఇంకా చాలా రోజులు ఉద్యమించాల్సి వస్తుందని రైతులు నిర్మాణాన్ని తలపెట్టారు. ఈ ఏర్పాట్లు చేసుకుంటే తాము ఇంకో సంవత్సరమైనా ఇక్కడే ఉండి పోరాడేందుకు సిద్ధమని స్థానిక రైతు అవతార్ సింగ్ మీడియాకి వెల్లడించారు. రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తునే తాము ఇంటికి వెళతామని స్పష్టం చేస్తున్నారు.
బెయిల్పై పంజాబ్ రైతులు విడుదల
గణతంత్ర దినోత్సవం రోజు చోటు చేసుకున్న హింసలో అరెస్టయిన ఏడుగురు పంజాబ్ రైతులు బెయిల్పై సోమవారం విడుదలయ్యారు. విడుదలకాగానే.. వారంతా టిక్రీలోని రైతు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. వారిని రైతులు సన్మానించారు. కిసాన్ ఏక్తా జిందాబాద్... మోడీ సర్కార్ ముర్దాబాద్... జై హింద్ నినాదాలతో ఆ ప్రాంతమంతా హౌరెత్తింది. ఢిల్లీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి తమను జైల్లో పెట్టారనీ, కానీ కోర్టుల్లో తాము ఏంటో నిరూపించుకుంటామని విడుదలైన తర్వాత రైతు బూటా సింగ్ మీడియాకి వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ సంతాపం
సాగు వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 248 మంది అన్నదాతలకు పంజాబ్ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. రైతు ఉద్యమంలో అకాల మృతి చెందిన వారికి నివాళులర్పించేందుకు రాష్ట్ర శాసనసభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అయితే, రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్తో రైతుల ఆదాయం రెట్టింపు : ప్రధాని
తాజాగా అమలు చేసిన చట్టాల్లోని కీలకమైన కాంట్రాక్ట్ ఫార్మింగ్తో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. సాగు రంగానికి బడ్జెట్ కేటాయింపులు అన్న అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో కలిసి ప్రధాని వెబ్నార్లో ప్రసంగించారు. దేశంలోని సాంప్రదాయ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఆధునిక పద్దతులతో ఈ రంగంలో మరిన్ని అద్భుతాలు చేయాలన్నారు. ప్రపంచ మార్కెట్కు మన దేశ ఆహార ఉత్పత్తులు అందజేసి, రైతుల జీవితాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలన్నారు.
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర : రాకేశ్ తికాయత్, బీకేయూ
ఖేతి కానూన్లపై ఉధతంగా పోరాడుతున్న రైతుల పోరాటాన్ని ఏ విధంగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ వెల్లడించారు. ఇన్ని రోజుల నుంచి ఉద్యమిస్తున్న తమతో చర్చలు జరపకుండా చెప్పిందే... చెప్పి దేశ ప్రజానీకాన్ని ఈ విషయంలో మోడీ సర్కారు తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం మౌన పాత్ర వహించడంలో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టు తాము అనుమానిస్తున్నామని వివరించారు. కేంద్రం ఎంతటి కుట్రలు చేసినా తమ ఐక్యత, పోరాటశైలీని దెబ్బకొట్టలేరని చెప్పుకొచ్చారు. చట్టాలను రద్దు చేసేదాకా పోరాటం చేస్తామని అన్నారు.
భారత్-పాక్ సరిహద్దులో ఏఐకేఎస్ కిసాన్ మజ్దూర్ కన్వెన్షన్ నిర్వహణ
వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన కోట్ సిద్దు గ్రామంలో ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) కిసాన్ మజ్దూర్ కన్వెన్షన్ పెద్ద ఎత్తున నిర్వహించింది. కాగా, ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐకేఎస్ పంజాబ్ కార్యదర్శి గురు చేతన్ సింగ్ బస్సీ, సుచా సింగ్ అంజాలా, దర్బార్ సింగ్ లోపకే, జోరా సింగ్ అవాన్ పాల్గొన్నారు. రైతు చట్టాల వల్ల కలిగే నష్టాలను నాయకులు రైతులకు వివరించారు. దీంతో అక్కడి వారంతా చట్టాలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానించారు. కాగా, ఈ సమావేశంలో పంజాబ్ సీపీఐ(ఎం) కార్యదర్శి సుఖ్విందర్ సింగ్ షెకాన్ సంఘీభావం తెలిపారు.