Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ తాకిడి తర్వాత రికార్డుస్థాయికి డిమాండ్
న్యూఢిల్లీ : కోవిడ్-19 సంక్షోభం దెబ్బకు భారత్లో ఇంధన వాడకం రికార్డుస్థాయిలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఇంధన డిమాండ్ పుంజుకుంటుందని సంకేతాలు వెలువడుతున్నాయి. 2022 మార్చి కల్లా ఇండియాకు గ్యాసోలీన్, డీజిల్, పెట్రోల్..ఇతర ఇంధనాల అవసరం 21.524కోట్ల టన్నులకు చేరుకుంటుందని పెట్రోలియం శాఖలోని ప్లానింగ్, ఎనాలసీస్ విభాగం అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న డిమాండ్తో పోల్చుకుంటే ఇది 10 శాతం ఎక్కువ. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా దేశంలో కఠినమైన లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంధన డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ఒకానొక స్థాయిలో ఇండియాలో ఇంధన వాడకం 70 శాతం పడిపోయింది. కొన్ని నెలలపాటు ముడి చమురు దిగుమతులు పెద్ద మొత్తంలో క్షీణించాయి. చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతుదారుగా ఇండియా అత్యంత కీలకమైన దేశంగా ఉంది. మనదేశంలో రవాణా, పారిశ్రామిక అవసరాలకు పెట్రోల్, డీజిల్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ ఇంధన అవసరాలకు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మార్చి 31తో ముగుస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డీజిల్, గ్యాసోలీన్ డిమాండ్ 8.5శాతం పడిపోగా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో 13శాతం పెరుగుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే విమాన ఇంధనంకు మాత్రం డిమాండ్ అనుకున్నంతగా లేదని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా కోలుకునే అవకాశముందని పెట్రోలియం శాఖ అంచనావేస్తోంది.