Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన యూపీ కిసాన్ మజ్దూర్ మోర్చా
- వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా..
లక్నో : కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యూపీ కిసాన్ మజ్దూర్ మోర్చా (యూపీకేఎంఎం) రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నిరాహార దీక్షలను ప్రారంభించింది. వివాదాస్పద చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు లీగల్ గ్యారంటి కల్పించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. నూతన చట్టాల విషయంలో రైతుల ఆందోళనకు గ్రామీణ ప్రాంతాల నుంచి మద్దతు ఏమాత్రమూ లేదని ఇప్పటి దాకా యోగి ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. దీంతో ప్రభుత్వ వాదనకు తగిన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించాలని యూపీకేఎంఎం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నిరాహార దీక్షలను ప్రారంభించింది. యూపీకేఎంఎం కింద మొత్తం 22 ప్రాంతీయ రైతు సంఘాలు ఉన్నాయి. కాగా, నిరాహాదర దీక్షల్లో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన రైతు బృందం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (మొత్తం 8 గంటల పాటు) ఆందోళన కొనసాగిస్తారు. అలాగే, మారుమూల ప్రాంతాలకు సైతం ఉద్యమం పాకేలా వీధుల్లో నిరసన ప్రదర్శనలతో పాటు ఇతర కార్యక్రమాలను రైతులు చేపడతారు.
నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మూడు నెలలకు పైగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారనీ, ఆందోళన ముగించే సంకేతాలేవీ లేవని యూపీకేఎంఎం ప్రతినిధి ముకుల్ త్యాగి అన్నారు. రైతులతో చర్చలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి తేదీలను ప్రకటించలేదని ఆయన చెప్పారు. కాబట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని తాము నిర్ణయించామని వెల్లడించారు. ప్రస్తుత ఆందోళనల్లో భాగంగా రైతులు, కార్మికులను ఏకం చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఉద్యమంలో యూపీలోని 65 వేల పంచాయతీలు, కనీసం 20 వేల గ్రామాలు పాలు పంచుకున్నాయని, ప్రతిరోజూ ప్రధానికి లక్ష సందేశాలు పంపుతామని దాద్రికి చెందిన ఒక యువరైతు తెలిపారు.