Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీల లాభాల్లోనే పెరుగుదల
- అచ్ఛేదిన్లో పెరిగిన నిరుద్యోగం
న్యూఢిల్లీ : భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వరుసగా రెండు త్రైమాసికాల్లో భారీ పతనాన్ని చవి చూడగా.. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం పెరగడాన్ని పాలక వర్గాలు పండగల అభివర్ణిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వి-ఆకారాంలో దూసుకెల్తోందని పదే పదే పేర్కొంటున్నాయి. కానీ దీనికి భిన్నంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు నెలకొని ఉన్నాయని, నిరుద్యోగం తాండవిస్తోందని.. ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయిందని న్యూస్క్లిక్ ఓ కథనంలో విశ్లేషించింది. 2020 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ 0.4 శాతం పెరిగింది. ఇంతక్రితం సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం, జూన్ త్రైమాసికంలో ఏకంగా 24.4 శాతం చొప్పున క్షీణించింది. కాగా క్యూ3లో సానుకూల వృద్థి నమోదు కావడాన్ని బీజేపీ వర్గాలు మళ్లీ మంచి రోజులు (అచ్ఛే దిన్) అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాయి. అయితే ఈ కాలంలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో నమోదైన కార్పొరేట్ కంపెనీల నికర లాభాలు మాత్రమే పెరిగాయి. మరోవైపు నిరుద్యోగం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడం ఆందోళనకర అంశం.సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ (సీఎంఐఈ) రిపోర్ట్ ప్రకారం.. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 2020 డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీలు రికార్డ్ స్థాయిలో రూ.1.6 లక్షల కోట్ల లాభాలు ఆర్జించాయి. దీన్ని ఓ వర్గం మీడియా వి-ఆకారపు ఆర్థిక రికవరీగా పేర్కొంటూ విపరీత ప్రచారం చేస్తోంది. అయితే సీఎంఐఈ విశ్లేషణ ప్రకారం.. విత్త రంగంలోని ఆదాయాలు పెరగ్గా.. మరోవైపు బ్యాంకింగేతర విత్త సంస్థల పరిస్థితి డోలయానంగానే ఉంది. పారిశ్రామిక వర్గాలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగించడం, వ్యయాలు తగ్గించుకున్నాయి. కొత్తగా ఉద్యోగులను తీసుకోలేదు. నూతన పెట్టుబడులను తగ్గించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీల లాభాలు పెరిగాయి.
చీకటి కోణం..
ఓ వైపు కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరగ్గా.. మరోవైపు దేశంలో నిరుద్యోగం అమాంతం పెరిగిందని సీఎంఐఈ శాంపుల్ సర్వేలో తేలింది. 2020 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశంలో 5.29 కోట్ల మంది నిరుద్యోగంతో బతుకు పోరాటం చేస్తోన్నారు. ఇదే సమయంలో కంపెనీల లాభాలు రికార్డ్ స్థాయిలో పెరిగి దేశ జీడీపీ 0.4 శాతం వృద్థిని నమోదు చేయడం విశేషం. 2019 డిసెంబర్ త్రైమాసికంలో దేశంలో 4.45 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా.. ఇది ఇప్పుడు 5.29 కోట్లకు చేరింది. కేవలం ఏడాదిలోనే 20 శాతం నిరుద్యోగం పెరగడం అత్యంత ఆందోళనకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతక్రితం రెండు త్రైమాసికాల్లో అంటే కరోనా, లాక్డౌన్ కాలంలో అయితే దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో 7.41 కోట్లకు ఎగిసింది. లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేసిన తర్వాత కొంత పురోగతి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ నిరుద్యోగం తీవ్ర ఆందోళనకర స్థాయిలోనే ఉంది.
కంపెనీల లాభాలు దూసుకెళ్లడం.. మరోవైపు నిరుద్యోగం పెరగడం యాదృచ్ఛికం ఏమీ కాదని.. ఇది పెట్టుబడిదారి విధానం ఫలితాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక వర్గాలు లాభాల్లో తేలియాడుతుంటే.. గుడిసెల్లోని కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం తగ్గి ఉపాధి పెరిగి.. అందరికీ మంచి వేతనాలు రావడం, రైతుల పంటలకు మద్దతు ధర కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ పెరుగుతుందని సూచిస్తున్నారు.