Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరుకుపోయిన బకాయిలు.. సంక్షోభంలో ఎంఎస్ఎంఈలు
- 12 నెలల్లో 88 శాతానికి...
- పెండింగ్లో 109 శాతం దరఖాస్తులు
- గతేడాది కేవలం 8.9 శాతమే సెటిల్మెంట్
- మోడీ సర్కార్ అలసత్వం వల్లే ఈ కష్టాలు : ఔత్సాహికవేత్తలు
'ఆత్మనిర్భర్ భారత్ 'వోకల్ ఫర్ లోకల్' కింద స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యతనిద్దాం. ఎంఎస్ఎంఈలతో దేశాభివృద్ధి ముడిపడిఉన్నది. ఎంఎస్ఎంఈల తక్షణ అవసరాల కోసం రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నాం. సద్వినియోగం చేసుకోండి'
- ప్రధాని మోడీ
కార్పొరేట్ల మేలు గురించి మాత్రమే జపిస్తున్న మోడీ ప్రభుత్వం.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను నెలకొల్పిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గాలికొదిలేస్తున్నది. ఉద్దీపన పథకాలంటూ పెద్దలకు వేలకోట్లు ఇవ్వటానికి రెడీ అవుతున్న బీజేపీ ప్రభుత్వం.. దేశ సంపదలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈలపై కనికరం చూపటంలేదు. జీడీపీలో 30శాతం నిధులందిస్తూ ఇతోధికంగా చేయూతనందిస్తున్న ఎంఎస్ఎంఈలను నీరుగారుస్తున్నదనటానికి తాజా నివేదికలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బకాయిలు చెల్లించకుండా ఔత్సాహికవేత్తల జీవితాలతో చెలగాటమాడుతున్నది.
న్యూఢిల్లీ : ఎంఎస్ఎంఈ బకాయిలను సకాలంలో చెల్లించటానికి ఓ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయినా చిన్నతరహా పారిశ్రామికవేత్తలకూ ఎలాంటి ప్రయోజనం చేకూరటంలేదు. చెల్లింపులు ఆలస్యమవుతున్న కొద్దీ.. సెటిల్ చేయని దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. గత 12 నెలల్లో ఏకంగా 88 శాతానికి చేరాయని రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి.
సెటిల్మెంట్ కావాల్సినది అక్షరాల రూ.19,557.91 కోట్లు
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2020 మార్చి 4 వరకు 9,901.31 కోట్ల పేమెంట్లో జాప్యంకాగా, వీటికి సంబంధించి 37,465 అప్లికేషన్లు వచ్చాయి. ఎంఎస్ఎంఈ బకాయిలు ఆగిపోవటంతో రూ.70,451 కోట్లు విలువ చేసే దరఖాస్తుల నుంచి ప్రస్తుతం రూ.19,557.81 కోట్ల మేర చెల్లింపులు ఆగిపోయాయి. ఇలా ఎంఎస్ఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (ఎంఎస్ఈఎపఫ్సీ)విభాగం పరిష్కరించాల్సిన దరఖాస్తుల సంఖ్య 109 శాతానికి చేరింది. వీటిలో కేవలం 8.9శాతం సెటిల్మెంట్లు జరిగాయి.
ప్రతి దరఖాస్తు 90 రోజుల్లో పరిష్కరించాలి
ఎంఎస్ఈఎఫ్సీ చట్టం-2006 ప్రకారం రాష్ట్రాల్లోని ఎంఎస్ఈఎఫ్సీ ఎంఎస్ఈ యూనిట్ సమర్పించే దరఖాస్తును పరిశీలించి, బకాయిలను వడ్డీతో సహా చెల్లించమని ఆదేశాలివ్వొచ్చు. అలానే ఎంఎస్ఈఎఫ్సీ వద్దకు వచ్చే దరఖాస్తును 90 రోజుల్లోనే పరిష్కరించాలన్నది నిబంధన.
2020 సెప్టెంబరు ప్రారంభంలో 500 కంపెనీలకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఆ తర్వాత 2800 లఘు కంపెనీలను సంప్రదించింది. కానీ చెల్లింపులు జాప్యమవుతున్నా ..వాటిగురించి లైట్ తీసుకుంటున్నదని ఔత్సాహిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సీపీఎస్ఈ బిల్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్లో చేరాలంటున్న కేంద్రం
వర్కింగ్ క్యాపిటల్ కొరతను అధిగమించడానికి ఎంఎస్ఎంఇకి సహాయపడటానికి వీలుగా కొనుగోలుదారులుగా బిల్ డిస్కౌంట్ ఫ్లాట్ఫాం (టీఆర్ఈడీఎస్)లో చేరాలని కేంద్రం ఎంఎస్ఎంఈలను కోరింది. వారికి చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గతేడాది మేలో ప్రభుత్వ సంస్థలను కోరారు.
జులైలో, ఖర్చుల విభాగం కార్యాలయ మెమోరాండం జారీ చేసి, ఎంఎస్ఎంఈ బకాయిలను సరైన సమయంలో చెల్లించనందుకు ప్రతి నెలా 1శాతం చొప్పున వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా చేస్తే బకాయిలు కనీసం సగానికి తగ్గుతాయని చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు భావించారు. కానీ అలా జరగటంలేదు. చెల్లింపుల్లేక చిన్నతరహా పరిశ్రమలు మూతపడేస్థితికి చేరుకుంటున్నాయి.
బకాయిలకు బాధ్యత ఎవరిదీ
ప్రభుత్వ రంగ సంస్థలు(పబ్లిక్ సెక్టార్) కంపెనీలు ఎంఎస్ఎంఈల నుంచి తీసుకున్న సరుకుకు సంబంధించిన బకాయిలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని చిన్న తరహా పరిశ్రమల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. లోక్సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ లిఖితపూర్వక సమాధామిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలపై ఒత్తిడి చేయలేమని పేర్కొన్నారు.
అలాంటప్పుడు ఎంఎస్ఎంఈ చట్టాలు ఎందు కు..? ప్రొత్సహిస్తామంటూ ప్రధాని స్వయంగా రాజ కీయం చేస్తున్నారు. మోడీ క్యాబినెట్ మంత్రే పార్ల మెంటులో మా వల్లకాదంటే.. తమకు దిక్కేవరని చిన్నతరహాపరిశ్రమల నిర్వాహకులు అంటున్నారు. సర్కారు నౌకరీలు రాక... స్వయం ఉపాధితో ఎంఎస్ ఎంఈలు పెట్టుకుంటే.. బ్యాంకులు మొదలుకుని కేంద్రం కూడా చేతులెత్తేయటానికి సిద్ధపడటం సరైంది కాదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.