Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరులో అసువులు బాసిన 248 మంది అన్నదాతలు
- నేడు ఢిల్లీ సరిహద్దుల్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ హై వే దిగ్బంధనం
- దేశవ్యాప్తంగా ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అప్రజాస్వామికంగా ఆమోదించుకున్న సాగు వ్యతిరేక చట్టాల మీద రైతులు చేస్తున్న ఉధృత ఉద్యమం నేటి(శనివారం)తో 100 రోజులకు చేరనున్నది. సాంప్రదాయ సాగు వ్యవస్థని సమాధి చేసే ఈ నల్ల చట్టాలు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ) కల్పించాలని, విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2020 తక్షణమే వెనక్కి తీసుకోవాలని రైతులు 2020 నవంబర్ 26న కర్షకులు ఆందోళన ప్రారంభించారు. గతంలో(2014 ఎన్నికల ప్రచార సందర్భంగా) మోడీ హామీ ఇచ్చిన విధంగానే ఎంఎస్పీ సీ2+50 శాతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 11 సార్లు చర్చలు జరపగా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం రైతులు ఆందోళనని విడకుండా... ఉద్యమ బాటనే కొనసాగిస్తున్నారు.
కరోనా కంటే నల్లచట్టాలు ప్రమాదకరం
యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి కంటే కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు చాలా ప్రమాదకరమని అన్నదాతల ఆవేదన. కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా పెరుగుతున్నా రైతులు పట్టించుకోకుండా పోరాడుతున్నారు. ఈ చట్టాలు అమలులోకివస్తే.. రైతుల రెక్కల కష్టాన్ని, రక్తాన్ని జలగల మాదిరి పీల్చుకు తింటాయని రైతుల్లో ఆందోళన. 100 రోజుల నుంచి బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్బంధాన్ని ఎదుర్కొన్నామనీ, అయినా ఇంకా ఉద్యమాన్ని ఆపమని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేయూ) సమన్వయకర్త దర్శన్పాల్ మీడియాతో వెల్లడించారు. జై జవాన్... జై కిసాన్, కిసాన్ బచావో... దేశ్ బచావో అన్న ప్లకార్డులు, నినాదాలు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఆ రైతు చట్టాలు రద్దు చేసేదాకా... ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఇండ్లకు వెళ్ళే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
100 రోజులుగా రోడ్లపైనే ఖానా... పీనా...సోనా
ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజన్హాన్పూర్, బురారీలోని నిరంకారీ మైదానంలో ఖానా... పీనా... సోనా అంతా రోడ్లపైనే. ఉద్యమస్థలాల్లో వారంతా సామూహికంగా వంట చేసుకుంటూ నిరసన తెలుపుతున్నారు. సుమారు ఒక సంవత్సరానికి సరిపడా వంట సామాగ్రి తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే తమ తిరుగు ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. రైతు ఉద్యమ సందర్శన ప్రాంతాల్లోకి వచ్చిన మీడియా మిత్రులు, పోలీసులకూ ఆహారం, నీళ్ళు ఇస్తున్నారు.
ఉద్యమకారులపై రాజద్రోహ కేసులా?
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఢిల్లీ పోలీసులు బెదిరించడం, వేధించే ధోరణ ఏమాత్రం ఆగలేదు. వందలాదిపై కేసులు నమోదు చేశారు. బెంగళూరుకి చెందిన దిశారవితో పాటు మరో ఇద్దరిపై రాజద్రోహం కేసులూ నమోదు చేశారు. అయితే, ఒక్క కేసూ కోర్టులో నిలవడం లేదు. అయితే, సాగు చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తక్కువ చేసే విధంగా ప్రకటనలు చేయడం గమనిస్తునే ఉన్నాం.
ఢిల్లీ సరిహద్దులు మూసివేత
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో గల సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్పూర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నవంబర్ 26 నుంచి వందలాది సార్లు బారికేడ్లతో మూసివేశారు. రైతులు ఢిల్లీ ప్రాంతంలోకి వచ్చే ప్రమాదం ఉందన్న నెపంతో సరిహద్దులో బారికేడ్లు వేసి మూసిశారు. తొలుత ఉద్యమం ప్రారంభమైన సమయంతో పాటు జవనరి 26వ తేదీన కూడా సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. దాంతోపాటు, కొన్ని రోజుల్లో ఇంటర్నెట్ సేవలు, మెట్రో సేవలను కూడా పూర్తిగా నిలిపివేసని పరిస్థితులు నెలకొన్నాయి.
నేడు కేఎంపీ ఎక్స్ప్రెస్ హైవే దిగ్బంధనం
రైతుల ఆందోళనలు దేశవ్యాప్తంగా 100వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో శనివారం (మార్చి 6న) ఢిల్లీ సరిహద్దుల్లోని కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్ హైవేను అన్నదాతలు దిగ్భంధనం చేయనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. దాంతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలనీ, అన్నదాతలు తమ ఇంటివద్ద నలజెండాలు ఎగురవేసిన నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.