Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలు అడ్డుకోవడానికే కొత్త ఐటీ నిబంధనలు : జర్నలిస్టులు, ఇండిస్టీ నిపుణులు
- తీయటి మాటల వెనుక దాగిన కోణం
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమంలో వెల్లువలా వచ్చి పడుతున్న నిరసనల్ని, న్యూస్ వెబ్పోర్టల్స్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తల్ని అడ్డుకోవడానికే మోడీ సర్కార్ కొత్త ఐటీ నిబంధనావళిని తీసుకొచ్చిందన్నది సుస్పష్టం. జర్నలిస్టు సంఘాలు కొత్త నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటంలో మీడియా పాత్ర ఎనలేనిది. మీడియా పోషించాల్సిన పాత్రను దెబ్బతీసే విధంగా కొత్త నిబంధనలున్నాయని జర్నలిస్టు సంఘాలు విమర్శిస్తున్నాయి. డిజిటల్ న్యూస్ మీడియాను పూర్తిస్థాయిలో నియంత్రించాలని కేంద్రం కోరుకుంటోందని ఇండిస్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ద వైర్, స్క్రోల్, న్యూస్ క్లిక్పై ఫిర్యాదులు పరిష్కారం నెపంతో కేంద్రం చర్యలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ జర్నలిస్టులు చెబుతున్నారు.
నిబంధనలు వర్తిస్తాయి..
ఆన్లైన్ న్యూస్ వెబ్ పోర్టల్స్, సామాజిక మాధ్యమాల (యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్..)పై నియంత్రణ కోసం కేంద్రం తీసుకొచ్చిన నిబంధనావళి సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2011 ఐటీ నిబంధనావళి స్థానంలో 'నూతన ఐటీ నిబంధనావళి, 2021' తీసుకొస్తోంది. అన్నిరకాల ఆన్లైన్ న్యూస్, మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్, ఓటీటీ (నెట్ఫ్లిక్స్, అమోజాన్..), కరెంట్ అఫైర్స్ వెబ్సైట్స్..మొదలైనవాటి అన్నింటికీ కొత్త నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది.
కేంద్రం చెప్పిందే ఫైనల్
ఉదాహరణకు సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ న్యూస్ మీడియా సంస్థలనే తీసుకుంటే , వీటిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి 'త్రీ టైర్' మెకానిజం ఏర్పాటుచేయాలని కేంద్రం చెబుతోంది. మొదటి టైర్లో మీడియా సంస్థ ఏర్పాటు చేసిన పరిష్కార బృందం ఉంటుంది. రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో సంబంధిత పరిశ్రమ వర్గాల స్వీయ నియంత్రణా బృందం 'సెకండ్ టైర్'లో ఉంటుంది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి కేంద్రం నేతృత్వంలో (3 టైర్) మరో బృందం ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారమన్నది టైర్-1 నుంచి మొదలవుతుంది. దీనికి కేంద్రం సంతృప్తి చెందకపోతే టైర్-3 రంగంలోకి దిగి ఆదేశాలు జారీచేస్తుంది. వాటిని సంబంధిత మీడియా హౌస్ పాటించాలి. మొత్తం ప్రక్రియ అంతా పరిశీలిస్తే..ఆన్లైన్ న్యూస్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ఓటీటీ..అన్నింటిపైనా కేంద్రం పూర్తిస్థాయిలో నియంత్రణ కోరుకుంటోందన్న విషయం స్పష్టమవుతోంది.
సంతృప్తి చెందేవరకు
ఫేస్బుక్, ట్విట్టర్, న్యూస్ వెబ్పోర్టల్...నుంచి వెలువడే కంటెంట్పై అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే..అవి మొదట కేంద్ర సమాచార, ప్రసారశాఖ గ్రీవియెన్సీ పోర్టల్కు వెళ్తాయి. అక్కడ్నుంచి మొదట టైర్-1 అయిన సంబంధిత మీడియా సంస్థకు వెళ్తాయి. సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ (రిటైర్ట్ జడ్జ్ నేతృత్వంలోని), కేంద్రానికి కూడా ఆ ఫిర్యాదు కాపీలు వెళ్తాయి. టైర్-1 అయిన మీడియా ఫిర్యాదును పరిష్కరించకపోతే, దానిపై సంతృప్తి చెందకపోతే టైర్-2, అలాగే టైర్-3కు ఫిర్యాదు వెళ్తుంది. టైర్-3 స్థాయిలో ఉన్న కేంద్రం నుంచి వెలువడే ఆదేశాలే ఫైనల్.
భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం
ప్రింట్, టెలివిజన్ మీడియాపై ప్రభుత్వం ఏ స్థాయిలో నియంత్రణను కలిగివుందో, అదే స్థాయిలో 'ఆన్లైన్, డిజిటల్ మీడియా'పై కొత్త నిబంధనలు ప్రభు త్వ పాత్రకు అవకాశం ఇస్తాయని కేంద్రం చెబుతోంది. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే నిబంధనలు ఇందులో లేవని కేంద్రం చెబుతోంది. అయితే కొత్త ఐటీ నిబంధనావళిపై జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పెదవి విరిస్తున్నారు. తీయని మాటలతో ఆన్లైన్ మీడియాపై 'సెన్సార్షిప్'కు దిగుతోందని విమర్శించారు.