Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానంపై మహిళా సంఘాలు
న్యూఢిల్లీ: ఇటీవల ఒక లైంగికదాడి కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ.బోబ్డే చేసిన వ్యాఖ్యలు, దానిపై వచ్చిన విమర్శలకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆప్ ఇండియా(బీసీఐ) చేసిన తీర్మానంపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తీర్మానంలో బీసీఐ ప్రస్తావించిన అంశాలు, ఉపయోగించిన భాష పట్ల అవి తీవ్ర ఆభ్యంతరం తెలిపాయి. మహిళా న్యాయానికి, స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్లు వచ్చినా, వాటిని ఎంతటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి చేసినా.. వాటిని విమర్శించే హక్కు తమకు ఈ దేశ చట్టాలు ఇచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాయి. ఈ మేరకు ఎఐడిడబ్ల్యుఎ(ఐద్వా), ఎఐఎఎంఎస్, ఎఐఎఎంఎస్ఎస్, ఎఐడిఎంఎఎం, ఎఐపిడబ్ల్యుఎ, సిఎస్డబ్ల్యు, ఎండబ్ల్యుఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యు, పిఎంఎస్, సహేలీ, ఎస్ఎంఎస్ తదితర మహిళా సంఘాలు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తీర్మానం ద్వారా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని అవి ఆక్షేపించాయి. కొద్ది మంది రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలుగా చెప్పుకునే కొంతమంది ఫోకస్ అవడానికి విమర్శపూరితంగా, నిర్లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారని బీసీఐ వ్యాఖ్యానించడం దారుణమని పేర్కొన్నాయి. తమ విమర్శలు ప్రేరేపితం లేదా మీడియా ద్వారా చేస్తున్న హానికరమైన దాడి అని చెప్పడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశాయి. స్త్రీపురుష సమానత్వం, న్యాయం కోసం పోరాడే.. లైంగిక హింస మహిళలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చేప్పే మహిళల వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతం అవుతుందని మహిళా సంఘాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీర్పులో లేవు కదా అని చెబుతున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం.. అత్యున్నత న్యాయవ్యవస్థకు చెందిన వారు చేసిన ఆ వ్యాఖ్యలు కేవలం న్యాయవ్యవస్థనే కాదు, మొత్తం దేశ ప్రజానీకాన్నే పెద్దయెత్తున ప్రభావితం చేస్తాయనే అంశాన్ని బార్కౌన్సిల్ అర్థం చేసుకోలేకపోయిందని పేర్కొన్నాయి. పెండ్లి చేసుకుంటే లైంగిక హింసకు పాల్పడినా చట్టం శిక్షించదు అనే ధోరణి మన సమాజాన్ని తిరోగమన దిశగా తీసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. తీర్మానంలో బృందాకరత్తో పాటు ఇతరుల పేర్లను ప్రస్తావించడం పూర్తిగా అసంగతమని తెలిపాయి. ' పెండ్లికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య ఒప్పందం జరిగిందా లేదా అన్నది అప్రసుత్తం. అయితే బాధితురాలికి పెళ్లి చేసుకుంటావా? అని దారుణంగా లైంగికదాడికి ఒడిగట్టిన వ్యక్తినే ఒక న్యాయమూర్తి అడగడం అనేది.. ఆమె అనుభవించిన హింసను, అయిన గాయాలతో పాటు బాధితురాలి గౌరవాన్ని తక్కువగా చేసి చూపుతుంది. ఏ న్యాయమూర్తి అయినా ఆ విధంగా అడగడం చాలా తప్పు.' అని తాము భావిస్తున్నామని మహిళా సంఘాలు స్పష్టం చేశాయి. పైగా నిందితుడికి అరెస్టు నుంచి నాలుగు వారాల పాటు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మహిళా సంఘాలు పేర్కొన్నాయి.
ఇక రెండో కేసు విషయానికి వస్తే.. సహజీవన సంబంధ విషయంలో లైంగికదాడి కేసును నమోదు చేయలేమని బీసీఐ భావిస్తున్నట్టు ఉందని మహిళా సంఘాలు తెలిపాయి. ఆ కేసులో బాధితురాలి వ్యక్తిత్వంపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నాయి. చట్టం ఎలా ఉన్నా.. వైవాహిక సంబంధంలో కానీ, సహజీవనంలో గానీ లైంగిక వేధింపులను గుర్తించాలని మహిళా సంఘాలు దశాబ్ధాలుగా పోరాడుతున్నాయని, వైవాహిక లైంగికదాడి రేప్గా పరిగణించాలన్న కేసు కూడా సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్లో ఉందని తెలిపాయి. స్త్రీ పురుష సమానత్వం, న్యాయం, మహిళల సమస్యలపై పోరాడుతున్న వారికి వ్యతిరేకంగా, బెదిరించేలా ఇలా బహిరంగ ప్రకటనలు విడుదల చేయడం మానుకోవాలని మహిళా సంఘాలు తమ ప్రకటన ద్వారా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కోరాయి.