Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70 ట్రిలియన్ డాలర్లు
- 1990 నుంచి ప్రపంచంపై పడిన ఖర్చు
- పూర్తి లింగ సమానత్వంతో ప్రపంచ జీడీపీ 28 ట్రిలియన్ డాలర్లకు :తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో లింగ అసమానత ఒకటి. ఎన్నో ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా లింగబేధం కారణంగా ఎందరో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా పురుషులతో సమానంగా ఎదగడంలో వెనకబడిపోతున్నారు. అయితే ఇన్ని సమస్యలకు కారణమైన లింగ అసమానత తో1990 నుంచి ప్రపంచంపై 70 ట్రిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 51.22 కోట్లు) భారం పడింది. ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
'అంతరాయం అంతానికి 257 ఏండ్లు'
కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలతో పాటు సామాజికంగా వెనకబడిన అనేక తరగతుల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అనేక నివేదికలు సైతం వివరించాయి. అయితే, ప్రస్తుత రేటు వద్ద ఈ అంతరాయాన్ని రూపు మాపాలంటే 257 ఏండ్లు పడుతుందని కొందరు ఆర్థికవేత్తలు తెలిపారు. అయితే, ఇలా చేయకపోవడం కారణంగా ప్రపంచానికి 1990 నుంచి 70 ట్రిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పూర్తి లింగ సమానత్వం 2025 నాటికి ప్రపంచ జీడీపీని 28 ట్రిలియన్ డాలర్లకు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 20.49 కోట్ల కోట్లు) పెంచగలదని తాజా నివేదిక పేర్కొన్నది. అలాగే, లింగ అసమానత కారణంగా మానవ మూలధన సంపద 160.2 ట్రిలియన్ డాలర్లు( దాదాపు రూ. 117.23 కోట్ల కోట్లు) కోల్పోవచ్చని అంచనా వేసింది. మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు 1 ట్రిలియన్ డాలర్ల ( రూ. 73 లక్షల కోట్లకు పైగా)ఆదాయానికి గండి పడింది.
2050 నాటికి ఏడాదికి 0.5శాతం వృద్ధి
విద్య, ఉపాధిలో లింగ, జాతి అంతరాలను తొలగించడం ద్వారా 2019లో 2.6 ట్రిలియన్ డాలర్ల ( దాదాపు రూ. 1.90 కోట్ల కోట్లు) ఆదాయం చేకూరేదని నివేదిక అంచనా వేసింది. 2019 డాలర్ రేటుతో పోల్చుకుంటే 1990 నుంచి సంచిత లాభాలు 70 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవని వివరించింది. ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలలో జాతి ఆదాయా అంతరానికి చెక్ పెట్టడం ద్వారా 2050 నాటికి ఏడాదికి 0.5శాతం వృద్ధిని పెంచుతుందని నివేదిక అంచనా వేసింది. కాగా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ 3.9 ట్రిలియన్ డాలర్లతో (రూ. 2.85 కోట్ల కోట్లు) ప్రపంచంలో నాలుగో అతిపెత్ద ఆర్థిక వ్యవస్థకు సమానమని పేర్కొన్నది.
4.70 కోట్ల మంది మహిళలు కడు పేదరికంలోకి
2021లో దాదాపు 96 మిలియన్ల ( 9.60 కోట్ల మంది )మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి వెళ్తారని నివేదిక అంచనావేసింది. అయితే, వీరిలో దాదాపు 47 మిలియన్ల మంది (4.70 కోట్ల మంది) మహిళలే ఉంటారని వివరించింది. మహిళల ఉద్యోగాలు 19 శాతం తీవ్ర ముప్పులో ఉన్నాయని హెచ్చరించింది. కరోనా మహమ్మారి కాలంలో మహిళలు పిల్లల, ఇంటి బాధ్యతలను చూసుకున్నానీ, అయినా వారి శ్రమకు ఫలితం లేదని వివరించింది. మహమ్మారికి ముందే లింగ అంతరం మరింత దిగజారిందనీ, ఆర్థిక సమానత్వాన్ని చేరుకోవడానికి 257 ఏండ్లు పడుతుందని నివేదిక హెచ్చరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 90 శాతం మంది వికలాంగ చిన్నారులు పాఠశాలలకు హాజరు కావడం లేదని నివేదిక పేర్కొన్నది.
అయితే, అసమానతలకు సంబంధించి 'మీ టూ' ఉద్యమం నుంచి 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' వరకు అణగారిన, వెనకబడిన తరగతుల ప్రజల్లో అవగాహన ఆల్ టైం హై గా ఉన్నదని నివేదిక వివరించింది. ఈ అవగాహన ప్రత్యేకించి మహమ్మారి కాలంలో పెరిగిందని పేర్కొన్నది.