Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 8 శాతం నెగెటివ్ వృద్ధి రేటు
- కరోనా, లాక్డౌన్ల ఎఫెక్ట్
- ఇండిస్టీ, సర్వీస్ సెక్టార్లపై తీవ్ర ప్రభావం
- ఎకనమిక్ సర్వే అంచనా
ముంబయి : మహారాష్ట్రను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇటు ఆరోగ్యపరంగా, అటు ఆర్థికంగా రాష్ట్రం తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇందుకు లాక్డౌన్ సైతం తోడయ్యింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 8శాతం నెగెటివ్కు పడిపోతుందని అంచనా. అంతేకాదు, ఇండిస్టీ, సేవా రంగాలు ఈ మహమ్మారి తీవ్ర కష్ట, నష్టాలను భరిస్తున్నాయి. 'ఎకనమిక్ సర్వే 2021'లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే రిపోర్టును శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అజిత్ పవార్, కౌన్సిల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శంభురాజ్ దేశారు లు ప్రవేశపెట్టారు.
ఈ సర్వే ప్రకారం.. వృద్ధి రేటు 8శాతం నెగెటివ్తో రూ. 19,62,539 కోట్లుగా ఉంటుందని అంచనా. అలాగే, పారిశ్రామిక రంగం, సేవా రంగాల నెగెటివ్ వృద్ధి రేటు వరుసగా 11.3శాతం, 9శాతంగా ఉండొచ్చు. ఇక చక్కటి వర్షపాతాల కారణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 11.7 శాతం వృద్ధి నమోదు కావచ్చు. అయితే, కోవిడ్-19 కారణంగా అతి తక్కువగా ప్రభావితమైంది ఈ ఒక్క రంగమే కావడం గమనార్హం. వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా పంటల పెరుగుదల 16.2 శాతం ఉంటుందని అంచనా. ఇక ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 31.04 లక్షల మంది అర్హత కలిగిన రైతులు రూ. 19,847 కోట్ల రుణమాఫీని పొందారు.
ఇక ఉత్పత్తి, నిర్మాణ రంగాలు వరుసగా 11.8 శాతం, 14.6 శాతం నెగెటివ్ వృద్ధితో తీవ్ర ప్రభావాన్ని చవిచూశాయి. అలాగే, వ్యాపార, రిపేర్, హౌటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లపై మహమ్మారి ప్రభావం కారణంగా సేవల రంగం 9 శాతం నెగెటివ్ వృద్ధిని చూపే అవకాశం ఉన్నది.
ఇక 2020-21లో తలసరి ఆదాయం రూ. 1,88,784కి పడిపోతుందని అంచనా. ఇది 2019-20లో రూ. 2,02,130 గా ఉన్నది. అలాగే రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆర్థిక లోటు 2.1 శాతంగా సర్వే అంచనా వేసింది. ఇక రెవెన్యూ రాబడులు 2020-21లో రూ. 3,47,457 కోట్లుగా ఉండగా.. ఖర్చులు రూ. 3,56,968 కోట్లుగా ఉంటాయని అంచనా. ఇక 2019-20 ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో నామినల్ జీఎస్డీపీ రూ. 1,56,925 కోట్లకు తగ్గిపోయే అవకాశం ఉన్నదని సర్వే వెల్లడించింది.