Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా దినోత్సవం రోజున భారీ నిరసనలు
- మహిళా కిసాన్ దినోత్సవానికి రైతుసంఘాల పిలుపు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో ఉధృతంగా సాగుతున్న రైతు ఉద్యమంలో మహిళలు తమవంతు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ మహిళా దినోత్సవమైన మార్చి 8న భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా మహిళా రైతులు, కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. సోమవారం 'మహిళా కిసాన్ దినోత్సవం' నిర్వహిస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జరగబోయే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్టు రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. పంజాబ్, హార్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. రాష్ట్రాల గ్రామాల నుంచి మహిళా కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని తెలిసింది. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు రావాలనుకుంటున్నారనీ, వారి కోసం బస్సులు ఏర్పాటుచేశామని భారతీయ కిసాన్ యూనియన్ మహిళా నాయకురాలు చరణ్జీత్ కౌర్ తెలిపారు. మహిళా కిసాన్ దినోత్సవం...ఉద్యమానికి ఒక పెద్ద మలుపు అని, మోడీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని సంయుక్త్ కిసాన్ మోర్చా నాయకులు భావిస్తున్నారు. నూతన సాగు చట్టాల ప్రభావం వ్యవసాయరంగంలో మహిళలు, పురుషులపై సమానంగా ఉంటుందని, అందుకే రైతు ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఎస్కేఎం నాయకులు చెప్పారు.