Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8.58 శాతానికి చేరిక : సీఎంఐఈ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో ఏకంగా 8.58 శాతానికి ఎగిసి.. 15 వారాల గరిష్ట స్థాయికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఓ రిపోర్ట్లో వెల్లడించింది. గడిచిన వారంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 260 బేసిస్ పాయింట్లు పెరిగి 9.81 శాతానికి చేరింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో 8.58 శాతం నుంచి 8 శాతానికి తగ్గడం విశేషం. ఇంతక్రితం జనవరి 31తో ముగిసిన వారంలో నిరుద్యోగిత గరిష్ట స్థాయి 8.84 శాతంగా చోటు చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో అనుహ్యాంగా పెరుగుతున్న నిరుద్యోగం వల్ల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోందని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు. గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వల్ల మే 3 నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 27.11 శాతంగా నమోదైంది. క్రమంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో ఈ ఏడాది జనవరి 4 నాటికి ఇది 4.66 శాతం తగ్గింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో.. పలు రాష్ట్రాల్లో తాజాగా అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలు నిరుద్యోగం మళ్లీ పెరిగేలా చేస్తోందని సీఎంఐఈ పేర్కొంది. ఏప్రిల్ 15 నాటికి దేశంలో 1.40 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి.