Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : పదేండ్ల బాలుడిపై బీజేపీకార్యకర్త కర్కశంగా దాడి చేశాడు. అతని ముఖం, తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పేంటంటే.. జైశ్రీరామ్ అని పలకకపోవడమే. ఈ ఘటన పశ్చిమబెంగాల్ పులి యాలోని నదియాలో జరిగింది. బీజేపీ కార్యకర్త మహ దేవ్ ప్రమాణిక్ నదియాలో ఒక టీస్టాల్ను నడుపుతు న్నాడు. మహాదేవ్ భార్య మిథు ప్రమాణిక్ స్థానిక బీజేపీ మహిళా విభాగం చీఫ్గా వ్యవహరిస్తున్నారు. టీస్టాల్ పక్కనుంచి వెళుతున్న బాలుడిని మహాదేవ్ అడ్డుకున్నాడు. జైశ్రీరామ్ అని పలకాలంటూ బాలుడిని బెదిరించడంతో పాటు బాలుడి తండ్రిపై అభ్యంత రకర వ్యాఖ్యలు చేసినట్టు స్థానికులు తెలిపారు. ఇందుకు నిరాకరించిన బాలుడిని చితక్కొట్టాడని స్థానికులు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బాలుడి తండ్రి ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేపట్టడం కూడా కారణమని అన్నారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై దాడికి దిగిన బీజేపీ కార్యకర్త మహదేవ్ ప్రమాణిక్ను ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. 12వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనను సుమోటుగా స్వీకరించి దర్యాప్తు చేపడతామని, నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.