Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది వ్యాక్సినేషన్ ప్రక్రియపై నీలినీడలు
- దేశంలో టీకా కార్యక్రమంపై అస్పష్టత : నిపుణులు
- 200 కోట్లకు పైగా డోసులు అందుబాటులోకి : కేంద్రం
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది. అయితే, జనాభాకు సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోవిధంగా కేంద్రం కేటాయింపులు జరుపుతున్నదనీ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. అయితే, ఈ తరుణంలో దేశంలో జనాభాకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయా? ఈ ఏడాదిలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందా? టీకా కార్యక్రమం ఇప్పటికే గందరగోళంగా కొనసాగుతున్న తరుణంలో ఈ లక్ష్యం పూర్తవడం సంక్లిష్టంగా కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం మాత్రం ఈ ఏడాదిలో 200 కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉంటాయని చెప్తున్నది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది. దేశీయంగా తయారైన కోవాక్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసుల చొప్పున ప్రజలకు ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్వేవ్ ప్రవేశించడానికి ముందు ఈ కార్యక్రమం స్తబ్దుగా జరిగింది. అంతేకాకుండా, కరోనా అంతమైందన్న అతివిశ్వాసంతో ఇతర దేశాలకు కేంద్రం వ్యాక్సిన్లను ఎగుమతి చేసిందని నిపుణులు తెలిపారు. అయితే, కరోనా సెకండ్వేవ్ దేశంలో ప్రవేశించడంతో పరిస్థితులు మారిపోయాయనీ చెప్పారు. రాష్ట్రాలకు టీకాల కొరత ఏర్పడిందని గుర్తు చేశారు. తొలుత 60 ఏండ్లు పైబడిన వారికి ఇస్తూ వచ్చిన వ్యాక్సిన్ను ఆ తర్వాత 45 ఏండ్లు పైబడినవారికి, ఆ తర్వాత 18 ఏండ్లు పైబడిన వారికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, సరైన ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యాక్సిన్ ప్రక్రియ కారణమైంది. తగినన్ని టీకాలు లేకపోవడంతో ఆయా రాష్ట్రాలు కూడా 18 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు గుర్తు చేశారు. దేశీయ వ్యాక్సిన్ల కొరత ఏర్పడటంతో రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్ దిగుమతికి కేంద్రం పచ్చజెండా ఊపిన విషయాన్ని తెలిపారు.