Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్టు వినోద్ దువాపై రాజద్రోహం కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువాపై రాజద్రోహం కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఈ సందర్భంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించిన న్యాయస్థానం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని స్పష్టం చేసింది. గతేడాది ఢిల్లీలో జరిగిన అల్లర్లపై వినోద్ దువా తన యూట్యూబ్ ఛానల్లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే..దాన్ని తప్పుడు కథనాలు ప్రసారం చేశారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేశారని ఆరోపిస్తూ హిమాచల్ప్రదేశ్ బీజేపీ నేత ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ వినోద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. అతడిపై సత్వర చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించింది. తాజాగా ఈ కేసులో జస్టిస్ యుయు.లలిత్, జస్టిస్ వినీత్ శరణ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి... దువాపై రాజద్రోహం, ఇతర కేసులను కొట్టివేసింది. 1962 నాటి కేదార్నాథ్ సింగ్ తీర్పు ప్రకారం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ ఉందని గుర్తు చేసింది. ''చట్టబద్ధమైన మార్గాల ద్వారా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తే, అందుకు బలమైన పదాలను ఉపయోగించినంత మాత్రాన రాజద్రోహం'' కాదని 1962 నాటి తీర్పు చెబుతోందని ధర్మాసనం తెలిపింది. అయితే,10 ఏండ్ల అనుభవం ఉన్న మీడియా సిబ్బందిపై ఎలాంటి కమిటీ నివేదిక లేకుండా కేసులు నమోదు చేయవద్దని వినోద్ అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది.