Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వం కొనటానికి ఖర్చు చేసినది 2250 కోట్లు
- పీఎం కేర్ కింద పనికిరాని ప్రాణవాయువు
- యంత్రాల పనితీరుపై వైద్యుల అసంతృప్తి
- చాలా రాష్ట్రాల్లో నిరుపయోగంగానే..!
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విష యంలో మోడీ సర్కారు నిర్లక్ష్య పనితీరుకు ఇది మరొక ఉదాహరణ. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటం కోసం అనేక రాష్ట్రాలకు వెంటిలేటర్లను అందించి ఆదుకుంటున్నామని ప్రచారాలు చేసుకుంటున్న మోడీ ప్రభుత్వం వాటి పనితీరును మాత్రం గాలికొదిలేసింది. వెంటిలేటర్ల కొనుగోలుకు మోడీ ప్రభుత్వం రూ. 2250 కోట్లను వెచ్చించింది. పలు వెంటిలేటర్లు అనేక రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు పంపిణీ అయ్యాయి. అయితే, వీటిలో చాల వరకు సరిగ్గా పనిచేయకపోవడంతో అవి మూలకు పడి ఉన్నాయి. ఈ వెంటిలేటర్ల పనితీరుపై వైద్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైన కొనుగోలు ప్రక్రియ కారణంగానే అతి చౌకగా వెంటిలేటర్లు లభించాయనీ, ఫలితంగా ఇప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో తీవ్రంగా సతమతమవుతున్న రాష్ట్రం మహా రాష్ట్ర. ఈ తరుణంలో ఔరంగా బాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి ఏప్రిల్ మూడోవారంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 150వెంటిలేటర్లను పంపిం చింది. అలాగే, మరఠ్వాడా ప్రాంతం లోని ఇతర జిల్లా, ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఈ యంత్రాలను పంపిణీ చేసింది. అయితే, ఈ వెంటిలేటర్లు మాత్రం పనికిరానివని ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రుల వైద్యుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ ఆస్పత్రుల నుంచి ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం కూడా దీనిపై ఇప్పటికే ఒక నివేదిక ను తయారు చేసింది. ఈ యంత్రాల వల్ల ఏర్పడే సమస్యలు, ఎదుర్కొన్న ఇబ్బందులను వారు అందులో వివరించారు. కోర్టుల్లో కేంద్రం అఫిడవిట్ల ద్వారా ఆర్టీఐ కింద వెల్లడైన సమాచారం ప్రకారం.. గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 60వేలకు పైగా వెంటిలేటర్ల కోసం కేంద్రం రూ. 2350 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో 50 వెంటిలేటర్ల కోసం పీఎం కేర్స్ కార్పస్ ద్వారా నిధులు సమకూర్చారు. అయితే, ఇన్ని కోట్లు వెచ్చించినా ఫలితం శూన్యంగా ఉండటంపై వైద్యరంగ నిపుణులు మోడీ ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక్క మహారాష్ట్ర మాత్రమే కాదు.. రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వెంటిలేటర్ల పనితీరుపై ఇప్పటికే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే, వెంటిలేటర్ల పనితీరు చక్కగానే ఉన్నదని కేంద్రం సమర్థించుకున్నది. సమస్య పరికరాల్లో లేదనీ, రాష్ట్రాల నిర్వహణలో ఉన్నదని ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచే వస్తున్నాయనీ, ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
అయితే, కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, గుజరాత్, గోవా నుంచి కూడా వెంటిలేటర్లపై ఫిర్యాదులు రావడం గమనార్హం. దీంతో విమర్శలు తీవ్రమవడంతో వెంటిలేటర్ల అంశంపై గతనెల 15న ప్రధాని మోడీ ఆడిట్కు ఆదేశించారు. అయితే, ఈ వెంటిలేటర్ల పని తీరుపై వైద్యులు, ప్రభుత్వ అధికారులు, వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలు వెల్లడించిన సమాచారం ప్రకారం కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఒక కంపెనీ తయారు చేసిన వెంటిలేటరు పనితీరుకు మరో కంపెనీ తయారు చేసిన వెంటిలేటర్ పనితీరుకు చాలా తేడా ఉన్నదని కొందరు వైద్యులు తెలిపారు. ఇందులో కొన్ని కంపెనీలకైతే క్రిటికల్ కేర్ వెంటిలేటర్లను తయారు చేయడంలో అనుభవమే లేదని చెప్పారు.
అంతేకాకుండా, ఈ యంత్రాల కొనుగోలు ప్రక్రియలోనూ గోల్మాల్ జరిగిందనీ, చౌకధరలకు వస్తున్న యంత్రాలను కొనుగోలు చేయడంతో నాణ్యత కొరవడిందని వెల్లడైంది. అయితే, యంత్రాలకు జరిపిన కేటాయింపులకు సంబంధించిన సమాచారంపై వచ్చిన పలు ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించకపోవడం గమనార్హం.