Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ భారీగా కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 8.3 శాతానికే పరిమితం కానుందని విశ్లేషించింది. ఈ ఏప్రిల్లో అంచనా వేసిన 10.1 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు 2 శాతం తక్కువ. ఆర్బీఐ అంచనా 9.5 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. కరోనా రెండో దశ భారత ఆర్థిక వ్యవస్థతో పాటు సర్వీసుల రంగాలను భారీగా దెబ్బ తీసిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2020-21 ద్వితీయార్ధంలో అంచనాల కంటే వేగంగా జరిగిన వృద్ధి పునరుద్ధరణను కరోనా రెండో దశ ఉధృతి అణిచివేసిందని పేర్కొంది. వచ్చే 2022-23లో మాత్రం వృద్ధి 7.5 శాతానికి, 2023-24లో 6.5 శాతానికి పరిమితం కావచ్చని నివేదికలో పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో జీడీపీ మైనస్ 7.3 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.6 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. జనవరిలో పేర్కొన్న 4.1 శాతంతో పోలిస్తే అంచనాను గణనీయంగా పెంచింది. గడిచిన 80 ఏండ్లలో మాంద్యం తర్వాత సంవత్సరంలో నమోదు కానున్న అత్యంత వేగవంతమైన వృద్ధి ఇదే కానుందని రిపోర్టులో పేర్కొంది. ఇటీవలే దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా తొలుత వేసిన 11 శాతం అంచనాకు ఏకంగా 9.5 శాతానికి కుదించింది. 2022 మార్చి నెలాఖరుతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వద్ధిరేటు 9.3 శాతంగా నమోదు కావచ్చునని మూడీస్ అంచనా వేసింది.